వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి
జనగామ సమీకృత కలెక్టరేట్ పరిశీలన
సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
జనగామ చౌరస్తా, జూలై 1: జనగామ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, కలెక్టర్ నిఖిలతో కలిసి పరిశీలించారు. కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించడానికి త్వరలో సీఎం కేసీఆర్ రానున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను సీపీ పరిశీలించి అనంతరం మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ పర్యటనకు సంబంధించి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వీఐపీల వాహనాల రాక, పార్కింగ్ ఏరియా, అధికారులతో సీఎం సమావేశం నిర్వహించే హాలు, సీఎం ప్రవేశం, నిష్క్రమణ స్థలాల గురించి పరిశీలించారు. హెలీప్యాడ్, గ్రీనరీ మిగులు పనులను త్వరగా పూర్తి చేయాలి అన్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, కార్యక్రమం సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయ పరిసరాలు, భవనంలోని గదులను సీపీ పరిశీలించారు. కార్యక్రమంలో జనగామ డీసీపీ (వెస్ట్జోన్) బీ శ్రీనివాస్రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, జనగామ ఏసీపీ ఎస్ వినోద్కుమార్, ఆర్డీవో మధుమోహన్, డీఆర్డీవో రాంరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ నాగేందర్రావు, జడ్పీ సీఈవో ఎల్ విజయలక్ష్మి, తహసీల్దార్ రవీందర్ పాల్గొన్నారు.