గాయంతో బార్టీ ఔట్.. గాఫ్ ముందడుగు
రోమ్: 20 గ్రాండ్స్లామ్ టైటిళ్ల వీరుడు, మట్టికోర్టు రారాజు రఫేల్ నాదల్ ఇటాలియన్ ఓపెన్ సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. గత వారం మాడ్రిడ్ ఓపెన్ క్వార్టర్స్లో తనను ఓడించిన అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ)పై ప్రతీకారం తీర్చుకొని ముందడుగేశాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో నాదల్ 6-3, 6-4 తేడాతో ఆరో సీడ్ జ్వెరెవ్పై వరుస సెట్లలో గెలిచాడు. 6 అడుగుల 11 ఇంచుల అమెరికా పొడగరి రెలీ ఓప్లెకా 7-5, 7-6 (7/2)తో డెల్బోనిస్పై గెలిచి.. తొలిసారి మాస్టర్స్ టోర్నీ సెమీస్ చేరాడు. సిట్సిపాస్ చేతిలో 4-6, 1-2తో టాప్ సీడ్ జొకోవిచ్ వెనుకబడిన తరుణంలో మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో టాప్ సీడ్ ఆష్లే బార్టీ గాయం కారణంగా నిష్క్రమించింది. అమెరికా యువ సంచలనం కోకో గాఫ్తో మ్యాచ్లో 6-4, 2-1తో ముందున్న సమయంలో బార్టీ తప్పుకుంది.