సరిహద్దు రాష్ర్టాల్లో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తున్న వేళ ఆక్సిజన్ కోసం హాహాకారాలు చేస్తుంటే.. తెలంగాణ మాత్రం అవసరానికి తగినంత ఆక్సిజన్ నిల్వలతో నిశ్చింతగా ఉన్నది! రాష్ట్రంలో 270 టన్నుల ఆక్సిజన్ డిమాండ్ ఉండగా, అంతకు మించి.. 400 టన్నుల ఆక్సిజన్ను సమకూర్చుకున్నది. రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలు, ప్రైవేటు దవాఖానల్లో కోరినవారికి కోరినంత ఆక్సిజన్ సరఫరా చేస్తూ రోగుల ప్రాణాలకు అభయమిస్తున్నది తెలంగాణ! వేరే రాష్ర్టాల్లో హాస్పిటళ్లకు ఎక్కడెక్కడి నుంచో దిగుమతి చేసుకుంటుంటే.. దవాఖానల్లోనే ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటు పెట్టి.. ఊపిరిని అందిస్తున్నది తెలంగాణ!
ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతోనే సాధ్యమైంది. కరోనా తీవ్రత, భవిష్యత్తు పరిణామాలను ముందే అంచనా వేసిన కేసీఆర్.. ఆక్సిజన్పై దృష్టి పెట్టారు. ప్రధాన దవాఖానలతోపాటు.. జిల్లా కేంద్ర దవాఖానల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని ఏ దవాఖానలోనూ ఆక్సిజన్ కొరత ఉన్నదన్న సమస్యే ఎదురుకావడం లేదు. అంతేకాకుండా.. రెమ్డెసివిర్ వంటి కీలకమైన ఇంజెక్షన్లను పెద్ద మొత్తంలో తెప్పించి.. కొరత లేకుండా చూస్తుండటంతో రాష్ట్రంలో కరోనా చికిత్స ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతూ.. పరిస్థితి తీవ్రమైనవారికి సైతం ప్రాణగండం నుంచి తప్పిస్తున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ఆక్సిజన్, పడకలు, మందులు, సిబ్బంది.. ఇలా అన్ని విషయాల్లో తెలంగాణ ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉండి, ఆపత్కాలంలో నాణ్యమైన వైద్యం అందిస్తున్నది. ముందు నుంచి వైద్యారోగ్య రంగాన్ని పటిష్ఠం చేయడం, కరోనా మొదటి వేవ్లో అనుసరించిన వ్యూహం వల్ల వైద్యరంగం దృఢంగా మారింది. అందుకే ప్రభుత్వ దవాఖానలు ఆక్సిజన్, రెమ్డెసివిర్, పడకల కొరత లేకుండా రోగులకు చికిత్స అందించగలుగుతున్నాయి. పక్క రాష్ర్టాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్, సిబ్బంది, ఐసొలేషన్ కిట్లు, రెమ్డెసివిర్ మందులు సమకూర్చుకోవాలని సీఎం కేసీఆర్ ముందే ఆదేశాలు జారీచేశారు. దీంతో తొలుత 2 లక్షలు, తర్వాత మొత్తం 4 లక్షల రెమ్డెసివిర్ ఇంజక్షన్లకోసం ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది.
దేశంలోనే ఏ రాష్ట్రం చేయనట్లుగా తెలంగాణనే మొదటిసారి ఈ చర్యకు ఉపక్రమించింది. ఆక్సిజన్ కొరత ఉంటుందని ముందే గుర్తించిన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నది. దేశంలోనే తొలిసారి ఆర్మీ విమానాలు ఉపయోగించి, ఒరిస్సా నుంచి ట్యాంకర్ల ద్వారా 160 మెట్రిక్ టన్నులు తీసుకువచ్చింది. వాటిని ప్రభుత్వ, ప్రైవేటు తేడా లేకుండా అవసరమైన ప్రాంతాలకు పంపిణీచేసింది. దీంతో తెలంగాణలో ఎక్కడా ఆక్సిజన్ సమస్య ఎదురుకావటం లేదు. నిజానికి కొందరు డీలర్లు, కొన్ని ప్రైవేటు దవాఖానల యాజమాన్యాల మధ్య ఒప్పందాలు కుదరకపోవడం, ఆక్సిజన్ తెచ్చుకొనే సామర్థ్యం లేకపోవటం వల్ల కొరత కొన్ని దవాఖానల్లో కొరత ఉందని చెప్తున్నారు. అంతేగానీ ప్రభుత్వ వైద్యశాలలు, మెడికల్ కాలేజీ అనుబంధ హాస్పిటళ్లలో, జిల్లా దవాఖానల్లో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదని స్పష్టంచేస్తున్నారు.
ఆక్సిజన్ ఉత్పత్తికి ఢోకా లేదు
సిబ్బంది, ఐసీయూ పడకలు, ఆక్సిజన్, మందులు.. తదితర అన్ని సమస్యల పరిష్కారం కోసం సీఎస్ ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారుల బృందం కృషిచేస్తున్నది. తెలంగాణలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నది. అన్ని జిల్లాల్లోని అవసరమైన అన్ని వైద్యశాలలకు ఆక్సిజన్ పంపుతున్నారు. ప్రస్తుతం రాష్ర్టానికి 270 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉండగా, 400 టన్నులు రాష్ర్టానికి వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకున్నది. ఇప్పటికే పలు జిల్లా కేంద్ర దవాఖానల్లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటు నెలకొల్పారు. మరికొన్ని చోట్ల స్టోరేజీ ట్యాంకులు నిర్మించారు. కరీంనగర్లో రూ.1.10 కోట్లతో అక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిమిషానికి 900 లీటర్ల ఆక్సిజన్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది.
ఈ ప్లాంట్ నుంచి రోజుకు 88 సిలిండర్ల నింపేంత ఆక్సిజన్ వస్తుంది. గాలిలో 19.5% నుంచి 20% ఉండే అక్సిజన్ను సంగ్రహించి, సురక్షితంగా మార్చి రోగులకు అందిస్తుంది. మొత్తంగా రాష్ట్రంలోని 120 మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి తోడు.. ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద మొత్తంలో ఆక్సిజన్ వస్తున్నది. టిమ్స్, గాంధీ, ఉస్మానియా తదితర హాస్పిటళ్లు, తెలంగాణ మెడికల్ కాలేజీ దవాఖానలు, జిల్లా దవాఖానల్లో కలిపి మొత్తం 22 లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఉన్నాయి. ఒక్కో ట్యాంకు కెపాసిటీ 20 కేఎం ఉంటుంది. కేంద్రం పీఎంకేర్ నుంచి 5 ఆక్సిజన్ మిషన్లు ఇవ్వగా, దీంతో రోజుకు గాంధీలో 29 లక్షల లీటర్లు, టిమ్స్లో 14 లక్షల లీటర్లు, ఖమ్మం దవాఖానలో 8,6 లక్షల లీటర్లు, భద్రాచలం దవాఖానలో 4.5 లక్షల లీటర్లు, కరీంనగర్లో 5.76 లక్షల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతున్నది. వీటికితోడు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మరో 12 ఆక్సిజన్ మిషన్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆక్సిజన్ విషయంలో తెలగాణలో ఒక్క దవాఖానకు కూడా ఇబ్బంది లేకపోగా, రాబోయే కాలంలో పేషెంట్ల సంఖ్య పెరిగితే, డిమాండ్కు తగ్గట్టుగా ఆక్సిజన్ సరఫరా కానున్నది.
3,010 ఆక్సిజన్ బెడ్లు వారంలో రెడీ
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 10 వేల ఆక్సిజన్ పడకలు ఉన్నాయి. సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో 600 ఐసీయూ పడకలున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ 600 వెంటిలేటర్లతో చికిత్స నడుస్తున్నది. కరోనా రాకముందు రాష్ట్రంలో 1,400 బెడ్లకు మాత్రమే ఆక్సిజన్ సరఫరా ఉంటే, సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఆ సంఖ్య 10 వేలకు పెరిగింది. గాంధీ దవాఖానలో ఇప్పటికే 1,400 బెడ్లకు ఆక్సిజన్ సరఫరా ఉండగా, మరో 400 పడకలకు ఆక్సిజన్ లైన్స్ వేయనున్నారు. గచ్చిబౌలి టిమ్స్లో 300, ఎంజీఎం వరంగల్ 300, నిమ్స్లో 200, ఎంసీహెచ్ సూర్యాపేట 200, నల్లగొండ ప్రభుత్వ దవాఖాన 200, మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖాన 200, ఎంసీహెచ్ సిద్దిపేటలో 200.. ఇలా మొత్తం 3010 పడకలకు ఆక్సిజన్ లైన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. యుద్ధప్రాతిపదిక వారంలోనే వీటిని సిద్ధం చేయనున్నట్టు తెలుస్తున్నది.