కొణిజర్ల, జూలై9 : ‘అంటువ్యాధులు, మలేరియా, డెంగీతో రెండు అంకెల సంఖ్యలో మృతులు నమోదు చేసుకున్న గ్రామమది.. అరకొర వసతులు.. సమస్యలతో రాజ్యమేలిన పల్లెల్లో ‘ప్రగతి’ కొత్తరూపును తీసుకొచ్చింది. ప్రభుత్వ నిధులు.. పల్లె ప్రగతి కార్యక్రమంతో సింగరాయపాలెం గ్రామ రూపురేఖలు మారిపోయాయి. గతంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామం నేడు.. ప్రగతిదారుల్లో పయనిస్తున్నది. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బురదమయంగా మారిన రోడ్లు, చెత్తాచెదారం.. దుర్గంధంతో అస్తవ్యస్తంగా ఉన్న గ్రామం ప్రస్తుతం నిరంతరం పారిశుధ్య కార్యక్రమాలతో స్వచ్ఛత దిశగా అడుగులు వేస్తున్నది. ఎక్కడ చూసినా పచ్చని మొక్కలతో కనువిందు చేస్తున్నది. గ్రామంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా ప్రశంసలు కురిపించారంటే అర్థం చేసుకోవచ్చు.
కొణిజర్ల మండలం సింగరాయపాలెం ఆదర్శ గ్రామపంచాయతీ దిశగా అడుగులేస్తున్నది. గతంలో రాజకీయాలతో అభివృద్ధి కుంటుపడింది. వివిధ సమస్యలతో ప్రజలు సతమతమయ్యారు. కానిప్పుడు ఆ పల్లెలో ప్రగతి పరుగులు పెడుతున్నది. గతంలో విపక్షపార్టీ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరయ్యే పరిస్థితి ఉండేది కాదు. నేడు తెలంగాణ సర్కారు పార్టీలకు అతీతంగా పల్లెల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నది. దీంతో గ్రామాల్లో అన్ని సౌకర్యాలు సమకూరుతున్నాయి. ప్రస్తుతం పంచాయతీ ప్రత్యేక నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్తోపాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు మొత్తం రూ.70 లక్షలతో సీసీరోడ్లు నిర్మించారు. గ్రామంలో వాటర్ప్లాంట్ ఏర్పాటు చేసి రూ.5కే ప్రజలకు శుద్ధజలం అందిస్తున్నారు. గ్రామంలోని పురాతన భవనాలను కూల్చివేసి నూతన పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. గ్రామంలో రోడ్లకు ఇరువైపులా పచ్చనిచెట్లు స్వాగతం పలుకుతున్నాయి. ఎన్నోఏళ్లుగా ఉన్న ఊరచెరువుకు ఆనుకొని నిర్మించిన పల్లెప్రకృతి వనం పచ్చనిచెట్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భౌగోళికంగా పక్కనే చెరువు ఉండడంతో మినీట్యాంక్ బండ్ను తలపించేలా ప్రకృతివనం ఆహ్లాదాన్ని పంచుతున్నది.
మంత్రి కేటీఆర్ ప్రశంసలు..
రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకృతివనాన్ని మెచ్చి కేసీఆర్ యజ్ఞం సఫలమైందని, పచ్చదనానికి 10 శాతం కేటాయించిన నిధులు సత్ఫలితాలు ఇస్తున్నాయంటూ ప్రకృతి వనం ఫొటోను ట్విట్టర్లో ప్రదర్శించారు. పల్లెల్లో ప్రగతి బాగుందని కితాబిచ్చారు.
నిరంతరం పారిశుధ్య కార్యక్రమాలు..
పంచాయతీ ట్రాక్టర్తో ఎప్పటికప్పుడు తడి, పొడిచెత్తను సేకరిస్తున్నారు. డంపింగ్యార్డుకు తరలించి సేంద్రియ ఎరువు తయారు చేయిస్తున్నారు. అద్దంలా మెరిసేలా రోడ్లను శుభ్రం చేస్తున్నారు. ప్రతి ఇంటా మొక్కలు నాటించడం, డ్రైనేజీలను శుభ్రం చేయించడం.. రోడ్లవెంబడి బ్లీచింగ్, ప్రత్యేక శానిటైజేషన్ పనులను నిర్వహిస్తున్నారు. ఆఖరి మజిలీ కష్టాలు తీర్చేలా వైకుంఠధామం నిర్మించారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. అంతేకాదు, గ్రామంలో ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించడంతో ఓడీఎఫ్ గ్రామంగా గుర్తింపు వచ్చింది. ఇంటి పన్నులు కూడా వందశాతం వసూలు చేసే దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతున్నారు.
గ్రామస్తుల సహకారంతోనే..
జిల్లా, మండల స్థాయి అధికారుల సూచనల మేరకు ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపడుతున్నాం. ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు కొనసాగిస్తున్నాం. శ్మశానవాటిక, డంపింగ్యార్డు నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంటి, నీటిపన్నులు వంద శాతం వసూలు చేస్తాం.
అభివృద్ధే ధ్యేయంగా ముందుకు
సొంతింటి లాగే పల్లె కూడా కళకళలాడాలనే ఆశయంతో గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నాం. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. గ్రామాభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాం. పంచాయతీ ఇప్పటికే ఓడీఎఫ్గా గుర్తింపు పొందింది. నూరుశాతం ఇంటి పన్నులు వసూలు చేసేలా ముందుకెళ్తున్నాం. ప్రభుత్వం ఇదే సహకారం అందిస్తే పంచాయతీని మరింత అభివృద్ధి చేస్తాం.
-దొడ్డపునేని జ్యోతి, సర్పంచ్