ముంబై: టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియాలో భారీ మార్పులు జరగబోతున్నాయి. పొట్టి ఫార్మాట్లో జట్టు సారధి బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకుంటాడు. అలాగే టీమిండియా కోచ్ పదవికి రవిశాస్త్రి గుడ్బై చెప్పేయనున్నాడు. దీంతో టీమిండియా తదుపరి కోచ్ ఎవరనే అంశంపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. అనిల్ కుంబ్లే కోసం బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రయత్నిస్తున్నా కుంబ్లేతోపాటు మిగతా బీసీసీఐ సభ్యులు ఈ విషయంలో సుముఖంగా లేరని సమాచారం.
ఈ క్రమంలో తాజాగా భారత లెజెండరీ బ్యాట్స్మెన్ రాహుల్ ద్రవిడ్ పేరు తెరమీదకు వచ్చింది. కోచ్గా ద్రవిడ్ నియామకం గురించి మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. కోచ్గా ద్రవిడ్, జట్టు మెంటార్గా ధోనీ ఉంటే అద్భుతంగా ఉంటుందని ప్రసాద్ అన్నారు. రవిశాస్త్రి స్థానంలో ద్రవిడ్ను నియమించడం సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు.
శ్రీలంక పర్యటనలో జట్టు కోచ్గా సిరీస్ను విజయవంతంగా ముగించిన తర్వాత ద్రవిడ్ మాట్లాడుతూ.. ఈ అనుభవాన్ని చాలా ఎంజాయ్ చేశానని చెప్పాడు. ఈ క్రమంలోనే ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ ఉండాలని నేను కచ్చితంగా అనుకుంటున్నా. కోచ్గా రాహుల్, మెంటార్గా ధోనీ ఉంటే బావుంటుంది. భారత జట్టులో వీరిద్దరూ ఉంటే రవిశాస్త్రి తర్వాత జట్టును చూడటం మరింత ఉత్సాహకరంగా ఉంటుంది’’ అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పారు.