హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దవాఖానలకు వచ్చే రోగులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం మార్గదర్శకాలు జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలన్నింటికీ ఇది వర్తిస్తుందని స్పష్టంచేసింది. రోజూ నివేదిక అందజేయాలని ఆదేశించింది.
-చికిత్స కోసం వచ్చేవారిలో ఎవరైనా శ్వాస సంబంధ సమస్యలతో బాధపడితే.
-దవాఖాన సిబ్బందిలో కరోనా లక్షణాలు కనిపించినవారికి.
-అత్యవసర చికిత్స కోసం దవాఖానలో చేరే హైరిస్క్ రోగులకు (వృద్ధులు, పదేండ్లలోపు పిల్లలు, దీర్ఘకాలిక రోగులు, గర్భిణులు)
-సర్జికల్/నాన్-సర్జికల్ చికిత్స కోసం దవాఖానలో చేరినవారికి కరోనా లక్షణాలు లేకపోయినా పరీక్షలు నిర్వహించాలి. వారానికి ఒకసారి మాత్రమే పరీక్ష చేయాలి.
-ప్రసవం కోసం దవాఖానలో చేరే గర్భిణులకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులకు సూచించారు. కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలని, టెస్టింగ్.. ట్రేసింగ్.. ట్రీటింగ్ (3టీ) విధానాన్ని కఠినంగా అమలుచేయాలని ఆదేశించారు. ఈటల బుధవారం వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. కరోనా కేసుల పెరుగుదల, చికిత్సపై సమీక్షించారు. ఫస్ట్ వేవ్ సమయంలో విస్తృత ఏర్పాట్లతో వైరస్ వ్యాప్తిని నియంత్రించామని, మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించామని చెప్పారు. ఇప్పుడు మరోసారి కేసులు పెరిగినా సమర్థంగా చికిత్స అందించగలమని పేర్కొన్నారు. మరోవైపు, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నదని ఈటల పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో మారుమూల జిల్లాల్లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం 56,122 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 684 మందికి పాజిటివ్గా తేలినట్టు బుధవారం బులెటిన్లో వైద్యారోగ్యశాఖ తెలిపింది. రికవరీ రేటు 97.83 శాతంగా, జాతీయ సగటు 94.1 శాతంగా ఉన్నది. జీహెచ్ఎంసీతోపాటు మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మొదటి నుంచి అత్యధికంగా కేసులు నమోదవుతుండగా.. తాజాగా నిర్మల్, నిజామాబాద్ వంటి గ్రామీణ జిల్లాల్లోనూ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 184, మేడ్చల్ మల్కాజిగిరిలో 61, నిజామాబాద్లో 48, రంగారెడ్డిలో 45 పాజిటివ్ కేసులు వచ్చాయి. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. మంగళవారం ఒక్కరోజే 45 వేల మందికి టీకాలు వేశారు.