వీర్నపల్లి, మార్చి 27: గర్జనపల్లి ఒకప్పుడు కల్లోలిత ప్రాతం. ఈ పంచాయతీ పరిధిలోనే ఉండేది సీతారాంనాయక్ తండా. ఇది ఇప్పుడు జీపీగా మారినా.. నాడు మాత్రం ఈ ప్రాంతమంతా అన్నల అలజడి, పోలీసుల బూట్ల చప్పుళ్లతో వణికిపోయింది. ఎంతో మంది యువత ఆగమవుతోంటే తల్లడిల్లిపోయేది. ఓ రోజు గ్రామానికి పోలీస్ జీపు వచ్చింది. ఆ జీపు ముందు సీట్లో కూర్చున్న ఓ ఎస్ఐని చూసి స్ఫూర్తి చెందాడు భూక్యా రాంరెడ్డి. అప్పుడు చదివేది ఆరో తరగతే అయినా, ఎస్ఐ కావాలని డిసైడ్ అయ్యారు. మాజీ సర్పంచ్ ధూమా నాయక్ కొడుకైన ఆయన, నిర్బంధం పరిస్థితులు ఉన్నా, అనేక ఆటుపోట్లు ఎదురైనా రాజీలేని ప్రయత్నం కొనసాగించారు. ఎల్లారెడ్డిపేటలోని గిరిజన వసతి గృహంలో చేరి, రెండోతరగతి నుంచి పదోతరగతి వరకు జడ్పీహెచ్ఎస్లో విద్యా భ్యాసం పూర్తి చేశారు. తమ గురువులు రామారావు, మురళీశర్మ, ప్రభాకర్రావు, విశ్వనాథం, నేవూరి రాజిరెడ్డి మార్గనిర్దేశనంలో ఉత్తమ మార్కులు సాధించారు. రేగులపాటి కిషన్రావు నేతృత్వంలో స్కౌట్స్ అండ్ గైడ్స్లో చేరి క్రమశిక్షణను అలవరుచుకున్నారు. అనంతరం ఏపీఆర్జేసీ నాగార్జునసాగర్లో ఇంటర్, ఎస్సారార్ కళాశాల కరీంనగర్లో డిగ్రీ పూర్తి చేశారు.
ఉద్యోగ ప్రస్థానం : తన లక్ష్యం కోసం అహోరాత్రులు శ్రమించిన ఆయన, 1989లో ఎస్ఐ ఉద్యోగం సాధించారు. ఖమ్మం జిల్లా వైరాలో ప్రొహిబిషన్ పూర్తి చేసుకొని, అక్కడే ఏడాది పాటు పనిచేశారు. ఆనంతరం చింతూరు, కొత్తగూడెం వన్టౌన్, ఎన్కూర్, ఇల్లెందు, మధిర ఠాణాల్లో విధులు నిర్వర్తించారు. 2000లో సీఐగా పదోన్నతి పొంది ఏడూర్ల బయ్యారంలో రెండేళ్లు పనిచేశారు. బదిలీపై అదిలాబాద్ టౌన్, శ్రీరాంపూర్, సీఐడీ(హైదరాబాద్)లో పని చేశారు. అనంతరం 2012లో డీఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది వరంగల్ డీటీసీలో వైస్ ప్రిన్సిపల్గా, వైరాలో డీఎస్పీగా, కరీంనగర్ పీటీసీలో ప్రిన్సిపల్గా పనిచేశారు. 2019లో అడిషనల్ ఎస్పీగా సీఐడీ(వరంగల్) రీజియన్ అధికారిగా పనిచేస్తున్నారు. సీఐడీ (కరీంనగర్) ఇన్చార్జి రీజియన్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం నాన్కేడర్ ఎస్పీగా ఉద్యోగోన్నతి లభించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.