న్యూఢిల్లీ: ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రైలు సర్వీసులు రద్దయ్యాయని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను రైల్వే మంత్రిత్వశాఖ సోమవారం నిరాకరించింది. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు పూర్తిగా నిరాధారం అని వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో తప్పుడు వార్తల క్లిప్లు సర్క్యులేట్ అవుతున్నాయని స్పష్టంచేసింది. ఈ వీడియో క్లిప్లు గతేడాది వార్తల్లో వచ్చినవేనని పేర్కొన్నది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ పేరిట వివరణ ఇచ్చింది. ఈ నెల 31వ తేదీ నుంచి రైలు సర్వీసులు రద్దు చేశామని భారతీయ రైల్వేస్ ఏనాడు ప్రకటించలేదని తెలిపింది. ప్రస్తుతం స్పెషల్ రైళ్లుగా నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైళ్లు, సబర్బన్ రైళ్లు యధావిధిగా కొనసాగుతాయని వివరించింది. ప్రయాణికులు తప్పనిసరిగా కొవిడ్-19 నిబంధనలు, మార్గదర్శకాలు పాటించాలని సూచించింది.