ఉస్మానియా యూనివర్సిటీ: క్రీడల్లో ఆసక్తి ఉన్న యువతకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఖేలో ఇండియా పథకం ద్వారా ఎంతో మంది క్రీడాకారులకు కేంద్రప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని, దీంతో ఒలింపిక్స్లో మన దేశ క్రీడాకారులు సత్తా చాటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్మించ తలపెట్టిన స్పోర్ట్స్ క్లస్టర్కు ఆదివారం ఆయన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణలో క్రీడల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం రూ. 26 కోట్లు కేటాయించింది. ఇందులో ఓయూకే 13.5 కోట్లు కేటాయింపులు చేశాం. నగరంలో అనేక కారణాల వలన క్రీడలకు సంబంధించిన స్థలాలు తక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో మరిన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక క్రీడలు, క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తున్నది. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ స్పోర్ట్స్ కాంప్లెక్స్లు నిర్మిస్తున్నాం’ అని అన్నారు.