కరోనా కష్టకాలంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా దేశంలో 11 శాతం వృద్ధిరేటు సాధిస్తామన్న కేంద్రప్రభుత్వ ఆశలు అడియాసలయ్యాయి. నాలుగు దశాబ్దాల తర్వాత 7.3 శాతం ప్రతికూల వృద్ధిరేటు నమోదు కావటం ఇదే మొదటిసారి. అలాగే ద్రవ్యలోటు సైతం జీడీపీలో 9.3 శాతమని తేలింది. ఇటీవలే ఫిక్కీ సంస్థ రూపొందించిన బిజినెస్ కాన్ఫిడెన్స్ సూచీ (బీసీఐ) కూడా భిన్నంగా లేదు. వినియోగ శాతం భారీగా తగ్గిపోయి ప్రజల దీనస్థితిని సూచిస్తున్నది. ఏడేండ్ల కిందట 7.4 శాతంగా ఉన్న భారత జాతీయ వృద్ధిరేటు ఇప్పుడు మైనస్ 7.3 శాతానికి పడిపోయి మన ఆర్థిక అవస్థకు అద్దం పడుతున్నది. ఆర్బీఐతో సహా దేశంలోని ఆర్థికరంగ సంస్థలన్నీ ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయని భయపడినా, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 1.6 వృద్ధి శాతంతో కొంత ఆదుకున్నది కాబట్టే ఈ మాత్రంగానైనా నిలుచున్నాం.
మొదటి దశ కరోనా లాక్డౌన్ కారణంగా కుప్పకూలిన ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రవాణా, మధ్య, చిన్నతరహా పరిశ్రమల ఉత్పత్తిరంగాన్ని ప్రోత్సహించింది. భారీ పరిశ్రమలను ఆర్థికదన్నుతో ఆదుకున్నది. అయి నా ఆశించిన మేర ఫలాలు సాధించటంలో విఫలమైంది. వ్యవసాయం, మత్స్యరంగం, అటవీరంగం మినహా సకలరంగాలూ గత ఆర్థిక సంవత్సరంలో తిరోగమనంలోనే ఉన్నాయని జాతీయ గణాంకాల కార్యాలయం వెల్లడించటం గమనార్హం. రెండో దశ కరోనా విజృంభించి మరిన్ని కష్టాలను తేబోతున్న పరిస్థితుల్లో గండం గట్టెక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలు నిర్మాణాత్మకంగా దీర్ఘకాలిక భవిష్యత్ దర్శనంతో ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నది.
కరోనా ఆపత్కాలం అనేది ఏదో మనకు మాత్రమే దాపురించిన అరిష్టం కాదు. దేశ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. అయినా అభివృద్ధి చెందుతున్న వర్ధమాన దేశాలేవీ మనంత దీనస్థితిలోకి దిగజారిన దుస్థితి లేదు. అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ నష్ట నివారణ చర్యలను చేపట్టాయి. ప్రజల కొనుగోలు శక్తి పెంచి, తద్వారా ఉత్పత్తిరంగాన్ని సంక్షోభం నుంచి కాపాడుతున్నాయి. దానికి గాను నేరుగా ప్రజలకు వ్యక్తిగతంగా ఆర్థికసాయాన్ని అందిస్తున్నాయి. ఈ దిశలోనే మోదీ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ప్రస్తుత సంక్షోభ పరిస్థితికి నగదు బదిలీయే ఔషధమన్న ప్రఖ్యాత ఆర్థికవేత్తల అభిప్రాయం కొట్టిపారేయలేనిది. అల్పాదాయ వర్గాలైన రైతులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లోని అసంఘటిత కార్మికులు, దిన కూలీలందరికీ ఆర్థికసాయం అందించటం ద్వారా ప్రజల వినిమయ శక్తిని పెంచాలన్నది అనుసరణీయం. ఆచరణాత్మక విధానాలతోనే ఆర్థిక గడ్డు పరిస్థితులను అధిగమించటం సాధ్యపడుతుంది.