ఖైరతాబాద్, జూన్ 24 : దగ్గు, సర్ది.. తలనొప్పి… ఇంకేమైనా లక్షణాలు ఉన్నాయా.. హైరానా పడాల్సిన అవసరం లేదు…. ఇంట్లో కూర్చోనే వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు….నిపుణులైన వైద్యుల సలహాలూ తీసుకోవచ్చు. ఆధునిక వైద్యానికి కృత్రిమ మేధస్సును జోడించి…. యువకుల బృందం ఓ నూతన యాప్ను సామాన్యుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్లిప్ హెల్త్ పేరుతో రూపొందించిన ఈ అప్లికేషన్ బహుళ ప్రయోజనకారిగా ఉంటుందని సీఈవో జి. విష్ణుకళ్యాణ్ రెడ్డి చెబుతున్నారు. ఆ యాప్ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం..
అతి తక్కువ ధరకే పేదలకు ఆధునిక వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఈ యాప్ను స్నేహితులు సుఖ్విందర్సింగ్, వెంకటేశ్లతో కలిసి ఎనిమిది నెలల పాటు కష్టపడి రూపొందించాను. గతేడాది నవంబర్లో అమెరికాలో ఈ యాప్ను విజయవంతంగా ప్రవేశపెడితే ప్రస్తుతం 50వేల మంది సేవలు పొందుతున్నారు. భారతదేశంలోనే మొదటి సారిగా కృతిమ మేధస్సును ఈ అప్లికేషన్కు అనుసంధానం చేసి దీనిని ప్రవేశపెట్టాం. త్వరలో సెల్ఫోన్లోనే గుండె లయను తెలుసుకునేందుకు ఈసీజీ టూల్ను ఈ యాప్లో పొందుపరుస్తున్నాం. కార్డియాలజీ మినహా 18 కీలకమైన విభాగాల వైద్యులు 24/7, 365 రోజులు అందుబాటులో ఉంటారు. ఈ సేవలను ప్రజలందరికీ చేరువ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి.. ఈ టెక్నాలజీని ఉచితంగానే అందిస్తాం. -జి. విష్ణుకళ్యాణ్ రెడ్డి, సీఈవో, ఫ్లిప్హెల్త్
ప్రస్తుతం www.flip.health వెబ్సైట్ ద్వారా ‘ఫ్లిప్ హెల్త్’ యాప్ను ఆండ్రాయిడ్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని సేవలను వినియోగించుకోవచ్చు. అనారోగ్య సమస్య వస్తే అందులో టెక్ట్స్ రూపంలో పొందుపరిస్తే నేరుగా సంబంధిత వైద్యుడిని ఆన్లైన్లోనే సంప్రదించవచ్చు. ముఖ్యంగా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వాటిని అందులో పొందుపరిస్తే మైల్డ్, మోడరేట్, క్రానిక్గా ఉందా అనేది డాక్టర్లు నిర్ధారిస్తారు. మొదటి రెండు లక్షణాలకు మంచి మందులను సూచించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. తద్వారా ఆస్పత్రులకు వెళ్లకుండానే పూర్తి స్థాయిలో ఇంటి వద్దే హోం ఐసొలేషన్లో ఉండి చికిత్స పొందవచ్చు. క్రానిక్గా ఉంటే వైద్యశాలకు వెళ్లాల్సిందిగా సలహా ఇస్తారు. రోగ పీడితుల కోసం 24/7 ఆన్లైన్లో వైద్యులు అందుబాటులో ఉంటారు.
ఫ్లిప్ హెల్త్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులోని సూచనల ప్రకారం… ఫోన్ కెమెరా ముందు చూపుడు వేలు పెడితే అందులోని రక్త ప్రసరణను స్కాన్ చేసి ఆక్సిజన్ శాచ్యురేషన్ లెవల్స్, పల్స్, హార్ట్ బీట్, రక్తపోటును అంచనా వేసి చెబుతుంది. ఇప్పటి వరకు 60వేల మందికి ఈ తరహా పరీక్షలు ప్రయోగాత్మకంగా నిర్వహించగా, 97 శాతం కచ్చితతం వచ్చిందని యాప్ నిర్వాహకులు చెబుతున్నారు.
నగరంలోని హైటెక్ సిటీకి చెందిన విష్ణుకళ్యాణ్రెడ్డి టీ హబ్లో యూఎస్కు చెందిన ‘మై ఆలీ’ కంపెనీలో గ్రోత్ మేనేజర్గా పనిచేశారు. ఆయన వేతనం సంవత్సరానికి అక్షరాల 21 లక్షలు. కార్పొరేటీకరణతో నాణ్యమైన, ప్రాథమిక వైద్యం సామాన్యులకు అందుబాటులో లేకుండా పోవడం, ఎందరో సమయానికి వైద్య సూచనలు, సేవలు అందక ప్రాణాలు కోల్పోతుండటంతో చలించిపోయారు. తన వంతు సాయంగా పేదలకు వైద్యాన్ని చేరువ చేయాలన్న లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలి ‘ఫ్లిప్ హెల్త్’ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఆధునిక టెక్నాలజీకి ప్రతీకగా నిలిచే కృత్రిమ మేధస్సును వినియోగించుకొని ఈ యాప్ను ఆవిష్కరించారు.
రోగం వచ్చి ప్రైవేట్ దవాఖానకు వెళితే నగరంలో వెయ్యి రూపాయలు, పట్టణాల్లో రూ.300 నుంచి రూ.500 చెల్లించుకోవాలి. మరో సారి వైద్యుడిని సంప్రదించాలంటే మళ్లీ అంతే సమర్పించుకోవాలి. కానీ ఫ్లిప్ హెల్త్ యాప్ ద్వారా కేవలం ఒక్కసారి రూ.100 చెల్లిస్తే పదే పదే చెల్లించాల్సిన అవసరం లేదు. నెల రోజుల పాటు నిపుణులైన వైద్యులను సంప్రదించవచ్చు. ఆన్లైన్లోనే 200 రకాల వ్యాధులను నిర్ధారించుకోవచ్చు. వైద్య సేవలూ పొందవచ్చు. మరో వంద చెల్లిస్తే….లక్షణాల ఆధారంగా 700 రకాల వ్యాధులను అంచనా వేసుకోవచ్చు.