న్యూఢిల్లీ: పైకి ఎదిగితే సరిపోదు.. అలా ఎదగడానికి తనకు సహకరించిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటేనే గొప్పోళ్లవుతారు. తాజా టోక్యో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను( Mirabai Chanu ).. తన గొప్ప మనసు చాటుకుంది. తాను ఈ స్థాయిలో ఉండటానికి పరోక్షంగా కారణమైన లారీ డ్రైవర్లను ఇంటికి పిలిచి భోజనం పెట్టి, వాళ్లకు ఓ షర్ట్, మణిపురి కండువా ఇచ్చి పంపించింది. ఇలా 150 మంది లారీ డ్రైవర్లకు ఆమె తనకు తోచిన సాయం చేసింది.
ఎవరు వీళ్లు.. చానుకు చేసిన సాయమేంటి?
మీరాబాయి చాను కుటుంబ పరిస్థితి తెలుసు కదా. చిన్నప్పటి నుంచీ కష్టమంటే ఏంటో ఆమెకు తెలుసు. అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని తలపై అలవోకగా మోస్తూ.. అలా అలా వెయిట్లిఫ్టింగ్పై మక్కువ పెంచుకుంది. అయితే ఆసక్తి ఉంటే సరిపోదు. అందుకు తగిన ఆర్థిక స్థోమత కూడా ఉండాలి. కానీ మీరాబాయికి లేనిది అదే. కనీసం తన ఊరి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రైనింగ్ సెంటర్కు రోజూ వెళ్లి వచ్చేందుకు తగిన డబ్బు కూడా లేని దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తన ఊరికే చెందిన ఇసుక లారీ డ్రైవర్లను ప్రతి రోజూ లిఫ్ట్ అడిగి ఇంఫాల్కు వెళ్లి వచ్చేది.
ఇలా వాళ్లు మీరాబాయికి కొన్నేళ్ల పాటు సాయం చేశారు. తాను ఇప్పుడీ స్థాయికి చేరుకోవడం పరోక్షంగా ఈ లారీ డ్రైవర్లు చేసిన సాయాన్ని కూడా ఆమె గుర్తు పెట్టుకుంది. అందుకే మెడల్ గెలిచి వచ్చిన తర్వాత తనకు సాయం చేసిన 150 మంది ఇసుక లారీ డ్రైవర్లను ఇంటికి పిలిచి భోజనం పెట్టి, తనకు తోచిన బహుమతి ఇచ్చింది. వాళ్లను చూసిన క్షణంలో ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టింది. వీళ్లే గనక తనకు సాయం చేసి ఉండకపోతే వెయిట్లిఫ్టర్ కావాలన్న తన కల సాకారం అయి ఉండేదే కాదని ఆమె చెప్పింది.