హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఖ్యాతి ప్రతిబింబించేలా అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నీ నిర్వహించాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. 2022 అక్టోబర్లో హైదరాబాద్ వేదికగా జరుగనున్న అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నీ సన్నాహక ఏర్పాట్లపై మంత్రి అధ్యక్షతన గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. గోల్ఫ్ క్లబ్ పక్కన ఉన్న ఇరిగేషన్ ట్యాంక్ను సుందరంగా తీర్చిదిద్దాలని, అలాగే వరద నీరు, మురికినీటిని మళ్లీంచాలని మంత్రి సూచించారు. మెట్రో వాటర్వర్క్స్, జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లను అభివృద్ధి చేసేందుకు ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. దీనిపై త్వరలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి ఆయా అంశాలపై చర్చించి వాటిని పూర్తి చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. ఇలాంటి టోర్నీల వల్ల జాతీయ స్థాయిలో టూరిజం అభివృద్ధి జరిగే అవకాశముందన్నారు. ఈ సమీక్షలో గోల్ఫ్ క్లబ్ గవర్నింగ్ సభ్యులు రజత్కుమార్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, టూరిజం ఎండీ మనోహర్, గోల్ఫ్ క్లబ్ అధ్యక్షుడు దయాకర్రెడ్డి పలువురు ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.