హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ వెటరన్ స్విమ్మర్ గోలి శ్యామలను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశంసించారు. ఇటీవలే అమెరికాలోని అత్యంత ప్రమాదకర కేటలీనా చానల్ను సాహాసోపేతంగా ఈదిన శ్యామలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం తన కార్యాలయంలో ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ‘ప్రపంచంలో ని సప్త సముద్రాలను ఈది దేశానికి, రాష్ర్టానికి శ్యామల మరిన్ని పేరు, ప్రతిష్ఠలు తీసుకురావాలి. ఎముకలు కొరికే సముద్రపు నీళ్లలో, అత్యంత ప్రమాదకరమైన కేటలీనా ద్వీపం నుంచి లాస్ ఏంజిల్స్ వరకు 36కి.మీలు ఈదడం సాధారణ విష యం కాదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ శ్యామల మెండైన ఆత్మవిశ్వాసం కనబరిచి లక్ష్యాన్ని చేరుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై శ్యామల సత్తాచాటడం సంతోషం గా ఉంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, మర్రి లక్ష్మణ్రెడ్డి, శ్యామల భర్త మోహన్, స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఉమేశ్ తదితరులు పాల్గొన్నారు.