చండీగఢ్: దిగ్గజ స్ప్రింటర్ మిల్కాసింగ్ భార్య, భారత మహిళల వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ నిర్మలా కౌర్ (85) కన్నుమూశారు. కరోనా వైరస్ సోకడంతో మొహాలిలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమె కోలుకోలేక ఆదివారం మృతి చెందారు. ఈ విషయాన్ని మిల్కా కుటుంబ సభ్యుడు ఒకరు వెల్లడించారు. కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో గత నెల 26న మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో నిర్మల చేరారు. కాగా వైరస్ బారిన పడిన దిగ్గజ స్ప్రింటర్ మిల్కా సింగ్ కూడా తొలుత ఆ దవాఖానలోనే చేరారు. అయితే అనంతరం పీజీఐఎంఈఆర్ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం మిల్కా సింగ్ ఐసీయూలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు.