టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్లో భారత్కు పతకాల పంట పండుతున్నది. ఇప్పటికే షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని లెఖారా స్వర్ణం సాధించగా.. ఇప్పుడు జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ మరో స్వర్ణాన్ని భారత్ ఖాతాలో చేర్చాడు. సుమిత్ అంటిల్ అత్యధికంగా 68.55 మీటర్ల దూరం తన ఈటెను విసిరి తొలి స్థానంలో నిలిచాడు. తన ఐదో అటెంప్ట్లో ఈ ఫీట్ సాధించడం ద్వారా సుమిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఇదే పోటీలో ఉన్న మరో భారతీయుడు సందీప్ కూడా అత్యధికంగా 62.20 మీటర్ల దూరం ఈటెను విసిరి తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. సుమిత్ అంటిల్ సాధించిన గోల్డ్ మెడల్తో కలిపి పారాలింపిక్స్లో భారత్ ఇప్పటివరకు రెండు బంగారు పతకాలు సాధించినట్లయ్యింది. మొత్తం పతకాల సంఖ్య ఏడుకు చేరింది. వాస్తవానికి భారత ఆటగాళ్లు సాధించింది 8 పతకాలు కాగా, డిజేబిలిటీ క్లాసిఫికేషన్లో వినోద్కుమార్ అనర్హుడిగా తేలింది. దాంతో అతనికి దక్కిన కాంస్య పతకాన్ని రద్దు చేశారు.