షార్జా: గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శనతో సూపర్-12కు దూసుకొచ్చిన శ్రీలంక.. ఇక్కడా అదే జోరు కొనసాగించింది. ఆదివారం గ్రూప్-1లో భాగంగా జరిగిన తొలి పోరులో లంక 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఓపెనర్ మహమ్మద్ నయీమ్ (62; 6 ఫోర్లు), సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (37 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో చమిక, ఫెర్నాండో, లహిరు తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో లంక 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. చరిత అసలంక (49 బంతుల్లో 80 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో యాంకర్ రోల్ పోషించగా.. భానుక రజపక్స (31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టాడు. బ్యాటింగ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్, నసుమ్ అహ్మద్ చెరో వికెట్లు పడగొట్టారు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి మంచి జోరు మీదున్న షకీబ్ను సరైన సమయంలో బౌలింగ్కు దించకుండా.. డెత్ ఓవర్స్ కోసం దాచి ఉంచడం బంగ్లా కొంపముంచింది. ఒంటి చేత్తో లంకను గెలిపించిన చరిత అసలంకకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు: బంగ్లాదేశ్: 20 ఓవర్లలో 171/4 (నయీమ్ 62, ముష్ఫికర్ 57 నాటౌట్; చమిక 1/12), శ్రీలంక: 18.5 ఓవర్లలో 172/5 (అసలంక 80 నాటౌట్, భానుక 53; షకీబ్ 2/17, నసుమ్ 2/29).
1:టీ20 ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు (41) పడగొట్టిన బౌలర్గా షకీబ్ నిలిచాడు. ఈ మ్యాచ్లో షకీబ్.. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (39)ని దాటేశాడు.