హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కారణంగా ఊపిరితిత్తులు ధ్వంసమైన వారికి బొడ్డుతాడుతో కొవిడ్కు చికిత్స చేయవచ్చని ట్రాన్స్సెల్ ఆంకాలాజిక్స్ ఫౌండర్ డాక్టర్ సుభద్ర ద్రావిడ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని అస్పైర్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్కు చెందిన బయోటెక్ స్టార్టప్ సంస్థ ‘ట్రాన్స్ సెల్ ఆంకాలజిక్స్’ వైవిద్యభరితమైన ఈ కొవిడ్ చికిత్సను ప్రారంభించిందని పేర్కొన్నారు. కరోనా సోకిన వ్యక్తుల్లో ఊపిరితిత్తులు పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారి శరీరంలో విడుదలయ్యే కొన్ని రసాయనాలు ఊపిరితిత్తుల్లోకి చేరి వాటిని మరింతగా ధ్వంసం చేస్తాయి. ఈ సమయంలో బొడ్డుతాడు నుంచి తీసిన మూల కణాలను ఇంజక్షన్ రూపంలో పేషెంట్కు ఇవ్వడం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడొచ్చని డాక్టర్ సుభద్ర ద్రావిడ తెలిపారు. బొడ్డుతాడు నుంచి తీసిన ఈ సెల్స్ను ఎక్కించడం ద్వారా శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్పారు.
అమెరికాలో ఈ చికిత్స మంచి ఫలితాలు ఇస్తున్నదని తెలిపారు. ఇండియాలో కూడా ఈ చికిత్సను వినియోగిస్తున్నారని వివరించారు. అత్యవసర సమయంలో ఈ చికిత్సను ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. వివిధ దవాఖానల నుంచి సేకరించిన బొడ్డుతాళ్ల నుంచి సెల్స్ను రెట్టింపు చేస్తామని వివరించారు. ఆ సెల్స్ను అభివృద్ధి చేసి అవసరమున్న వారికి అందిస్తామని చెప్పారు. ఈ సెల్స్ను వైద్యులకు అందిస్తే వారు ఇంజక్షన్ రూపంలో పేషెంట్లకు ఇస్తారని వివరించారు.