న్యూఢిల్లీ: ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు) రజతంతో సరిపెట్టుకుంది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, ఐదుసార్లు ఆసియా విజేత మేరీకోమ్.. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన తుదిపోరులో 2-3తో నాజిమ్ (కజకిస్థాన్) చేతిలో ఓటమి పాలైంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఐదు సార్లు (2003, 2005, 2010, 2012, 2017) స్వర్ణాలు నెగ్గిన మేరీకోమ్ కజక్ బాక్సర్కు సరైన బదులివ్వలేకపోయింది. 2008 ఆసియా చాంపియన్షిప్ ఫైనల్లో ఓడిన మేరీకోమ్కు ఈ టోర్నీలో ఇది రెండో రజతం. మొదటి రౌండ్లో బాక్సర్లిద్దరూ పంచ్ల వర్షం కురిపించుకోగా.. రెండో రౌండ్లో మేరీ కాస్త వెనుకబడినట్లు కనిపించింది. 38 ఏండ్ల మేరీ మూడో రౌండ్లో పుంజుకునేందుకు ప్రయత్నించినా.. నాజిమ్ పంచ్లతో ముంచెత్తింది. దీంతో దిగ్గజ బాక్సర్కు ఓటమి తప్పలేదు.
75 కేజీల మహిళల విభాగంలో పూజా రాణి బంగారు పతకం చేజిక్కించుకుంది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన పూజ ఫైనల్లో 5-0తో మలూడా మలనోవా (ఉజ్బెకిస్థాన్)పై విజయం సాధించింది. 2019లో 81 కేజీల విభాగంలో బరిలోకి దిగి పసిడి నెగ్గిన పూజ ఈ సారి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. ఈ టోర్నీలో తొలిసారి బరిలోకి దిగిన భారత బాక్సర్ లాల్బుత్సాహి (64 కేజీలు) 2-3తో మిలానా సఫ్రొనోవా (కజకిస్థాన్) చేతిలో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకోగా.. ప్లస్ 81 కేజీల తుదిపోరులో అనుపమ.. కజికిస్థాన్ బాక్సర్ చేతిలో పరాజయం పాలైంది.
పంగల్ పసిడి గురి
పురుషుల 52 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్, డిఫెండింగ్ చాంపియన్ అమిత్ పంగల్ నేడు ఫైనల్ బౌట్లో బరిలోకి దిగనున్నాడు. అతడితో పాటు శివ థాపా (64 కేజీలు), సంజీత్ (91 కేజీలు) పసిడి పతకం కోసం పోటీ పడనున్నారు. రియో ఒలింపిక్స్ విజేత షకబొద్దీన్ (ఉజ్బెకిస్థాన్)తో పంగల్ తలపడనుండగా.. బతార్సుఖ్తో శివథాపా అమీతుమీ తేల్చుకోనున్నాడు. 17 దేశాలకు చెందిన సుమారు 150 మంది బాక్సర్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసుకుంది. 2019 బ్యాంకాక్ టోర్నీలో 13 పతకాలు చేజిక్కించుకున్న భారత బాక్సర్లు ఈ సారి దానికంటే మిన్నగా 15 మెడల్స్ తమ పేరిట రాసుకున్నారు.