టోక్యో పారాలింపిక్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతున్నది. పోటీల ఏడో రోజు మూడు మెడల్స్ ఖాతాలో వేసుకున్న మనవాళ్లు.. ఓవరాల్గా పది పతకాలతో విశ్వక్రీడల చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. హై జంప్లో డిఫెండింగ్ చాంపియన్ మరియప్పన్ తంగవేలు రజతం సొంతం చేసుకోగా.. ఇదే ఈవెంట్లో శరద్ కుమార్ కాంస్యం చేజిక్కించుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో సింగ్రాజ్ కాంస్యం పట్టడంతో.. పతకాల పట్టికలో భారత్ రెండంకెలకు చేరింది!
టోక్యో: విశ్వక్రీడల చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. టోక్యో ఒలింపిక్స్లో ఏడు పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అథ్లెట్లను ఆదర్శంగా తీసుకొని పారా అథ్లెట్లు విజృంభిస్తున్నారు. సోమవారం పోటీల్లో ఐదు పతకాలతో అదుర్స్ అనిపించిన పారా అథ్లెట్లు.. మంగళవారం మరో మూడు పతకాలు ఖాతాలో వేసుకున్నారు. పురుషుల హై జంప్ (టీ42)లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన మరియప్పన్ తంగవేలు 1.86 మీటర్ల ఎత్తు దూకి రజతం కైవసం చేసుకుంటే.. ఇదే విభాగంలో పోటీపడ్డ మరో భారత అథ్లెట్ శరద్ కుమార్ 1.83 మీటర్లతో కాంస్యం గెలుచుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్హెచ్1 ఈవెంట్లో సింగ్రాజ్ అదానా కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు. దీంతో ఈ క్రీడల్లో 10 పతకాలు (2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు) ఖాతాలో వేసుకున్న భారత్.. పట్టికలో 30వ స్థానంలో నిలిచింది. పారాలింపిక్స్ చరిత్రలో టోక్యోకు ముందు భారత్ 12 పతకాలు సాధిస్తే.. ఈ ఒక్క క్రీడల్లోనే మనవాళ్లు పది మెడల్స్ పట్టడం విశేషం. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్హెచ్1 విభాగంలో రుబీనా ఫ్రాన్సిస్ ఏడో స్థానంలో నిలిచి నిరాశ పరిస్తే.. మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టు క్వార్టర్ ఫైనల్లో చైనా చేతిలో ఓడింది. వ్యక్తిగత విభాగంలో రజతం నెగ్గిన భవీనాబెన్ పటేల్ 0-3 (4-11, 7-11, 6-11)తో మరోసారి యింగ్ జో చేతిలో పరాజయం పాలవడం.. మహిళల జట్టు ఆశలపై నీళ్లు చల్లింది. పురుషుల ఆర్చరీ కాంపౌండ్ క్వార్టర్ ఫైనల్లో రాకేశ్ కుమార్ ఓడిపోవడంతో ఆర్చరీలో భారత్ పోరాటం ముగిసినైట్లెంది.
ఇంట్లోనే షూటింగ్ రేంజ్..
కుటుంబ సభ్యులు షూటింగ్లో శిక్షణ పొందుతుంటే చూసి ఆసక్తి పెంచుకొని నాలుగేండ్ల క్రితం గన్ను పట్టిన సింగ్రాజ్ అదానా.. టోక్యో పారాలింపిక్స్లో కాంస్యం గెలిచాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్హెచ్1 ఈవెంట్లో సింగ్రాజ్ 216.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. షూటింగ్లో సోమవారం అవని లేఖరా స్వర్ణం సాధించగా.. భారత్కు ఇది రెండో పతకం. ఈ ఈవెంట్లో డిఫెండింగ్ చాంపియన్ చావో యాంగ్ (చైనా, 237.9 పాయింట్లు), హుయాంగ్ జింగ్ (చైనా, 237.5 పాయింట్లు) వరుసగా స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. ఇదే విభాగంలో పోటీపడిన భారత షూటర్లు మనీశ్ నర్వాల్, దీపేందర్ సింగ్ వరుసగా ఏడో, పదో స్థానాలతో సరిపెట్టుకున్నారు. హర్యానాకు చెందిన సింగ్రాజ్ అదానా.. పోలియో బారినపడి కాళ్లు కోల్పోయాడు. ఫరీదాబాద్లోని సైనిక్ స్కూల్కు చైర్మన్గా వ్యవహరిస్తున్న సమయంలో షూటింగ్ వైపు అడుగులు వేసిన 39 ఏండ్ల సింగ్రాజ్.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడంతో సరైన ప్రాక్టీస్ లేక నిద్రలేని రాత్రులు గడిపాడు. శిక్షణ కొనసాగించే మార్గం కనబడక తీవ్ర అసహనానికి గురైన సింగ్రాజ్.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఇంట్లోనే షూటింగ్ రేంజ్ ఏర్పాటు చేసుకున్నాడు. ‘శిక్షణ సజావుగా సాగకపోవడంతో.. ఒలింపిక్ పతకం నెగ్గాలనే నా చిరకాల స్వప్నం నెరవేరదేమో అని భయపడ్డా. ఆ సమయంలో ఇంట్లోనే షూటింగ్ రేంజ్ ఏర్పాటు చేసుకోమని కోచ్లు సలహా ఇచ్చారు. ఇది చాలా కష్టమైన పని అని తెలిసినా.. కుటుంబ సభ్యుల సహకారంతో ఖర్చుకు వెనుకాడకుండా రేంజ్ను ఏర్పాటు చేసుకున్నా’అని అంటున్న సింగ్ రాజ్.. పారిస్ పారాలింపిక్స్లో పసిడి పట్టడమే తన తదుపరి లక్ష్యమని చెప్పాడు.
ధైర్యాన్నిచ్చిన భగవద్గీత
పారాలింపిక్స్లో పతకం పట్టాలని రెండేండ్లుగా ఇంటికి వెళ్లకుండా విదేశాల్లో శిక్షణ పొందిన శరద్ కుమార్ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. రెండేండ్ల వయసులోనే పక్షవాతం వల్ల ఎడమ కాలు కోల్పోయిన పాట్నాకు చెందిన శరద్ కుమార్.. కేంద్ర ప్రభుత్వ సాయంతో గత రెండేండ్లుగా ఉక్రెయిన్లో ఉంటూ విదేశీ కోచ్ల వద్ద శిక్షణ తీసుకున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా ఇంటికి రాలేకపోయిన అతడు.. టోక్యోలో అద్వితీయ ప్రదర్శనతో పతకం పట్టాడు. పోటీలకు ముందు రోజు కాలి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడిన శరద్.. ఒక దశలో బరిలో దిగకూడదని నిర్ణయించుకున్నా.. కుటుంబ సభ్యుల సలహాతో ధైర్యంగా ముందుకు సాగాడు. ‘భగవద్గీత చదువు ధైర్యం వస్తుందని మావాళ్లు చెప్పారు. దీంతో మనసు మార్చుకొని బరిలోకి దిగా. శాయశక్తుల కృషి చేసి దేశానికి కాంస్యం అందించా’అని పోటీ అనంతరం శరద్ చెప్పాడు.
డబుల్ ధమాకా..
ఐదేండ్ల క్రితం రియో (2016) ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గి డిఫెండిగ్ చాంపియన్గా బరిలోకి దిగిన 26 ఏండ్ల మరియప్పన్ తంగవేలు మంగళవారం పోటీల్లో రెండు సెంటీమీటర్ల తేడాతో స్వర్ణం కోల్పోయాడు. వర్షం అంతరాయం మధ్య సాగిన టీ42 ఈవెంట్లో తంగవేలు 1.86 మీటర్ల ఎత్తు దూకగా.. అమెరికాకు చెందిన సామ్ గ్రేవే 1.88 మీటర్లతో పసిడి కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలోనే శరద్ కుమార్ (1.83 మీ.) కాంస్యం నెగ్గగా.. భారత్కే చెందిన మరో అథ్లెట్ వరుణ్ సింగ్ భాటి (1.77 మీ.) ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఐదేండ్ల వయసులో బస్సు చక్రాల కిందపడి కుడి కాలు కోల్పోయిన తంగవేలు.. అనేక కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరాడు. పేదరికానికి తోడు కుమారుడు కాలు కోల్పోవడంతో తంగవేలు తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఇలాంటి క్లిష్ట సమయంలో అతడి తల్లి కూలి పనులకు వెళ్తూ తంగవేలును పెంచింది. అనంతరం తంగవేలు కూరగాయలు విక్రయిస్తూ తల్లికి చేదోడువాదోడుగా నిలిచాడు. అయితే చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్ అంటే ఇష్టపడే తంగవేలు.. హై జంప్లో చక్కటి ప్రతిభ కనబర్చేవాడు. ఇది గుర్తించిన బెంగళూరులోని సాయ్ కోచ్ సత్యనారాయణ ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి అతడిని అంతర్జాతీయ స్థాయి అథ్లెట్గా తీర్చదిద్దాడు.
పసిడి పతకాన్ని చేజిక్కించుకోవడంతో పాటు ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాలనే లక్ష్యంతో టోక్యోలో అడుగుపెట్టా. కానీ వర్షం నా ఆశలపై నీళ్లు కుమ్మరించింది. 1.80 మీటర్ల ఎత్తు దూకిన తర్వాత వరుణుడి కారణంగా కాస్త ఇబ్బంది ఎదురైంది. తడిగా ఉన్న వాతావరణంలో పరిగెత్తడం కష్టమైంది. రియో (2016) పారాలింపిక్స్లో స్వర్ణం నెగ్గా.. ఈ సారి అది సాధ్యపడలేదు. పారిస్ (2024) క్రీడల్లో కచ్చితంగా పసిడి సాధిస్తా.