బ్యూనస్ ఏరిస్: అర్జెంటీనా క్రీడాకారుడు, స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ డీగో మారడోనా గత ఏడాది నవంబర్లో గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే అతని మృతిపై అనుమానాలు వ్యక్తం అయిన నేపథ్యంలో ఆ దేశ మెడికల్ బోర్డు ఓ నివేదికను తయారు చేసింది. ఆ నివేదికను సోమవారం వెల్లడించనున్నారు. మారడోనాకు చికిత్స అందించిన డాక్టర్లు చాలా నిర్లక్ష్యం వహించారని, అందుకే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా తెలుస్తోంది. ఈ కేసులో ఏడుగురు వ్యక్తులను విచారిస్తున్నారు. వారిపై మర్డర్ కేసును కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్లాన్ ప్రకారమే మారడోనాను చంపినట్లు న్యూరోసర్జన్ లియోపోల్డో లుక్యూ, సైకియాట్రిస్ట్ అగస్టినా కొసాచోవ్, సైకాలజిస్ట్ కార్లోస్ డియాజ్లు కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ దోషిగా తేలితే వీరికి 25 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.
మెదడులో గడ్డకట్టిన నేపథ్యంలో మారడోనాకు సర్జరీ చేశారు. అయితే ఆ తర్వాత నెల రోజులకు డీగో గుండెపోటుతో చనిపోయాడు. ఈ సమయంలో ఆయన వ్యక్తిగత వైద్యులు సరైన చికిత్స ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. మారడోనాకు చెందిన ఇద్దరు కూతుళ్లు కేసు వేయడంతో ఆ దేశ మెడికల్ బోర్డు ఈ విచారణ చేపట్టింది. అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్కు అయిదుగురు కూతుళ్లు ఉన్నారు. మారడోనా మరణాన్ని అడ్డుకునేందుకు డాక్టర్లు ఎటువంటి ప్రయత్నం చేయలేదని ప్రాసిక్యూటర్లు ఓ భావనకు వచ్చారు. అయితే చివరి దశలో మారడోనా.. మద్యం, డ్రగ్స్కు తీవ్రమైన బానిసకు గురైనట్లు తెలుస్తోంది. మారడోనా చావుబతుకుల మధ్య ఉన్నా.. ఆయన డాక్టర్లు ఆయన్ను పట్టించుకోలేదని మెడికల్ బోర్డు తన నివేదికలో అభిప్రాయపడింది. 1986లో ఒంటి చేత్తో మారడోనా.. అర్జెంటీకాకు ఫుట్బాల్ వరల్డ్కప్ అందించాడు. దాంతో అతను వరల్డ్ ఫేమస్ సాకర్ ప్లేయర్ అయ్యాడు. అయితే మారడోనా ఆస్తి కోసం అయిదుగురు కూతుళ్లు, సోదరులు, లాయర్ మధ్య కూడా వివాదం ఉన్నట్లు తెలుస్తోంది.