హైదరాబాద్: మనీశ్ నర్వాల్ వయసు 19 ఏళ్లే. ఇండియన్ షూటింగ్లో ఇప్పుడితనో సంచలనం. పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి.. యువ సూపర్స్టార్ అయ్యాడు. అర్జున అవార్డు గ్రహీత అయిన మనీశ్ నర్వాల్.. 2001, అక్టోబర్ 17న జన్మించాడు. టోక్యోలో జరుగుతున్న పారాఒలింపిక్స్లో పీ4 50మీ ఎయిర్ పిస్తోల్ ఎస్హెచ్1 ఈవెంట్లో మనీశ్ అందర్నీ స్టన్ చేస్తూ గోల్డ్ మెడల్ కొట్టేశాడు. నిజానికి ఇదే టోర్నమెంట్లో 10మీ ఎయిర్ పిస్తోల్ పోటీలో పతకాన్ని చేజిక్కించుకోలేకపోయిన నర్వాల్.. 50 మీ పిస్తోల్ ఈవెంట్లో మాత్రం తన సత్తా చాటాడు.
మనీశ్కు పుట్టుకతోనే కుడి చేతిలో లోపం ఉంది. కుడి చేయికి వైకల్యం ఉండడం వల్ల.. అతను ఎడమ చేయితో షూటింగ్ చేస్తున్నాడు. ఎస్హెచ్1 క్లాసిఫికేషన్లో మనీశ్ తన నైపుణ్యాన్ని పెంచుకున్నాడు. నిజానికి ఫుటబాల్ అంటే నర్వాల్కు ఇష్టం. ఆ గేమ్లోనే ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. కానీ అంగవైకల్యం వల్ల షూటింగ్ను కెరీర్గా ఎంచుకున్నాడు. కోచ్ సుభాష్ రానా అతన్ని రాటుదేల్చాడు. స్ప్రింట్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్, స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనిల్ మెస్సీలు.. మనీశ్కు ఫెవరేట్ ప్లేయర్లు. చిన్నతనం నుంచి తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో నర్వాల్ అద్భుత ఆటగాడిగా మారాడు. తండ్రి దిల్భాగ్ నర్వాల్ ఓ రెజ్లర్. క్రీడలకు ఉన్న ప్రాముఖ్యత ఆయనకు తెలుసు. మనీశ్కు సరైన క్రీడ ఏందన్న కోణంలో ఆయన పరిశీలించి.. 2016లో షూటింగ్ను మనీశ్ కెరీర్గా మలిచారు.
షూటింగ్లో మనీశ్ వరల్డ్ రికార్డులు నెలకొల్పతూ సెన్షేషన్ ప్లేయర్గా అవతరించాడు. రోజు రోజుకూ తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ మరింత మెరుగైన షూటర్లతో పోటీపడుతున్నాడు. 2016 నుంచి 2019 వరకు వివిధ పోటీల్లో అతను 19 మెడల్స్ సాధించి తన సత్తాను చాటాడు. 2018 ఏసియన్ పారాలింపిక్స్లో పసిడి పతకం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2019లో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో ఏకంగా మూడు మెడల్స్ కైవసం చేసుకున్నాడు. తాజాగా టోక్యో గేమ్స్లో కేవలం స్వర్ణ పతకాన్ని గెలవడమే కాదు.. కొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. 2020లో అర్జున్ అవార్డు అందుకున్న అతను మరింత మెరుగవ్వడం సంతోషకరం.