హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫారాలు సిద్ధం చేయాలని, బడులు ప్రారంభం కాగానే పంపిణీ ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు. రూ.121 కోట్లు వెచ్చించి రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది విద్యార్థులకు యూనిఫారాలు అందజేయనున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థుల యూనిఫారాలు, మనఊరు-మనబడి పనుల పురోగతిపై మంగళవారం సైఫాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 2023 ఏప్రిల్ కల్లా యూనిఫారాలను సిద్ధం చేసి ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం జరగకుండా చూడాలని సూచించారు. అయితే యూనిఫారాల రంగు మార్పు అంశం చర్చకు వచ్చింది. అధికారులు నాలుగైదు జతలను కుట్టించి మంత్రికి చూపించగా.. ఇప్పుడున్న కలర్, డిజైన్లోనే యూనిఫారాలు తయారు చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థినులకు చున్నీ బదులు అటాచెడ్ వేస్కోట్ (Waistcoats) లతో కూడిన యూనిఫారాలు అందజేయాలని అన్నారు.
1,200 బడుల్లో పనులు పూర్తి
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే ‘మనఊరు -మనబడి’ మొదటిదశలో చేపట్టిన వాటిల్లో 1,200 పాఠశాలల్లో నిర్మాణ పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. వీటిల్లో సీసీ కెమెరాలు, ఫర్నిచర్, ఉన్నత పాఠశాలల్లో క్రీడా మైదానాలను డిసెంబర్ 15కల్లా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మిగతా పాఠశాలల్లో కూడా పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకులు శ్రీదేవసేన పాల్గొన్నారు.