ముంబై: భారత వెటరన్ టెన్నిస్ స్టార్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతి ఓ వెబ్సిరీస్ కోసం మళ్లీ జతకట్టనున్నారు. ఇద్దరి టెన్నిస్ ప్రయాణాన్ని, వారి అనుభవాలను ఈ సిరీస్ ద్వారా పంచుకోనున్నారు. పేస్ – భూపతి ద్వయం 1999 వింబుల్డన్ టోర్నీ పురుషుల డబుల్స్ టైటిల్ గెలువడం భారత టెన్నిస్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. దేశానికి ఇదే తొలి వింబుల్డన్ టైటిల్. 1994- 2006, 2008-11 మధ్య కలిసి ఆడిన పేస్-భూపతి ఆ తర్వాత విభేదాల వల్ల విడిపోయారు. అయితే ఇటీవల తమ వింబుల్డన్ టైటిల్ విజయానికి 22వ వార్షికోత్సవం సందర్భంగా అప్పటి ఫొటోను ట్వీట్ చేసి పేస్ ఆనందాన్ని పంచుకోగా.. అది ఎంతో ప్రత్యేకం, మరో అధ్యాయానికి నాంది పలికేందుకు ఇది సరైన సమయం అనుకుంటున్నావా అంటూ భూపతి బదులిచ్చాడు.