చిన్నారుల ఎదుగుదలకు తెలంగాణ సర్కారు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. బాలామృతం చిన్నారుల్లోని పౌష్టికాహార లోపాలను నివారిస్తున్నది. వయస్సుకు తగిన ఎత్తు.. ఎత్తుకు తగిన బరువుతో రేపటి తరం ఆరోగ్యవంతంగా తయారవుతున్నది. ఇటీవల ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రోత్ మానిటరింగ్ రిపోర్టు దీన్ని ధ్రువపరుస్తున్నది. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా బాలబాలికలు భేష్ అని తేలింది. కేవలం స్వల్ప సంఖ్యలో చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఆ చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. మూడు నెలల్లో నిర్దేశిత లక్ష్యంతో తగిన చర్యలు చేపడుతున్నారు.
చిన్నారుల సంరక్షణ, ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారిస్తున్నది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు తదితర పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. ప్రస్తుతం ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు , మూడు నుంచి ఆరేండ్ల పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో బాలామృతం అందిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారంతో కొంతమేరకు పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతున్నా పలు జిల్లాలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరోసారి పిల్లల ఎదుగుదలపై గత ఫిబ్రవరిలో ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించింది.
అంగన్వాడీ కేంద్రాల్లోని 0-5 ఏండ్ల చిన్నారుల్లో ఎంత మంది వయస్సుకు తగిన ఎత్తు, బరువు ఉన్నారనే వివరాలను సేకరించింది. జిల్లాల వారీగా స్త్రీ, శిశు సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్యశాఖల సమన్వయంతో ఆయా కేంద్రాల్లోని పిల్లల వయస్సు, వారి బరువు, ఎత్తు సహా ఆరోగ్య స్థితిగతుల్ని పరీక్షించింది. అనంతరం ప్రతి చిన్నారికీ ప్రత్యేకంగా ఆరోగ్య పర్యవేక్షణ కార్డును సైతం అందజేసింది.
హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా చార్మినార్, నాంపల్లి, గోల్కొండ, సికింద్రాబాద్, ఖైరతాబాద్ మొత్తంగా ఐదు ఐసీడీఎస్ క్లస్టర్లు ఉన్నాయి. వాటి ద్వారా మొత్తంగా 99201 మంది చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రోత్ మానిటరింగ్ రిపోర్టు జిల్లాలోని బాలలు భేష్ అని తేల్చింది. కేవలం స్వల్పసంఖ్యలో మాత్రమే పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించింది. అందులో మొత్తంగా 8.8శాతం మంది చిన్నారులు వయస్సుకు తగిన బరువు లేకపోగా, 5.9శాతం మంది చిన్నారులు పౌష్టికాహార లోపాలతో బాధపడుతున్నారు. 24.1శాతం మంది చిన్నారుల్లో వయస్సుకు తగిన ఎత్తు లోపించింది. మొత్తంగా చూస్తే జిల్లావ్యాప్తంగా 80 శాతానికిపైగానే చిన్నారులు ఆరోగ్యవంతులుగా ఉన్నట్లు గ్రోత్ మానిటరింగ్ నివేదిక స్పష్టం చేసింది.
గ్రోత్ మానిటరింగ్ డ్రైవ్లో భాగంగా గుర్తించిన పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర్రావు నేతృత్వంలో డబుల్ రేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ఆ చిన్నారులకు ప్రత్యేకంగా రిజిస్టర్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వారి ఎత్తు, బరువు తదితర స్థితిగతులను పరీక్షిస్తున్నారు. మూడు నెలల్లో అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులందరినీ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ప్రస్తుతం కొమురంభీమ్-ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో చేపట్టిన ఈ బాలామృతం ప్లస్ పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలు నిస్తుండడం గమనార్హం.
జిల్లా పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న ప్రతి చిన్నారి ఆరోగ్యాన్ని పరీక్షించాం. లోపాలున్నవారిని గుర్తించాం. కలెక్టర్ శ్వేత మహంతి ఆదేశాల మేరకు లోపాలతో బాధపడుతున్న చిన్నారులకు అదనంగా పోషకాహారాన్ని అందివ్వాలని నిర్ణయించాం. ఒకవేళ ఎవరికైనా తీవ్రమైన పోషకాహార లోపంతో ఇబ్బందులు పడుతుంటే వారికి అవసరమైన వైద్యం చేయించే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నాం. పౌష్టికాహార లోపాలున్న చిన్నారులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. వారి కోసం ప్రత్యేక రిజిస్టర్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వారి స్థితిగతులను నమోదు చేస్తున్నాం. – అక్కేశ్వర్రావు, హైదరాబాద్ జిల్లా సంక్షేమశాఖ అధికారి