నైరోబి: భారత లాంగ్జంప్ సంచలనం శైలి సింగ్ అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రజత పతకం కైవసం చేసుకుంది. కెన్యా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ ఫైనల్లో ఆదివారం శైలి 6.59 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. మజా అస్కాగ్ (స్వీడన్, 6.60 మీటర్లు), మరియా హొరిలోవ (ఉక్రెయిన్, 6.50 మీటర్లు) వరుసగా స్వర్ణ, కాంస్యాలు దక్కించుకున్నారు. పదిహేడేండ్ల శైలి కెరీర్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా.. కేవలం ఒక సెంటీమీటర్తో ఆమె స్వర్ణ పతకానికి దూరమవడం గమనార్హం. ఈ పోటీల్లో 4×400 మిక్స్డ్ రిలేలో భారత జట్టుకు కాంస్యం దక్కగా.. 10 వేల మీటర్ల రేస్వాక్లో అమిత్ ఖత్రి రజతం గెలుచుకున్నాడు. పోటీల చివరి రోజు శైలి ప్రదర్శనతో ఓవరాల్గా మూడు పతకాలు మన ఖాతాలో చేరాయి. ఈ మెగాటోర్నీలో భారత్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. గత రెండు పర్యాయాలు నీరజ్ చోప్రా (2016), హిమాదాస్ (2018) ఈ వేదికపై స్వర్ణాలు నెగ్గిన విషయం తెలిసిందే.
అంజు శిక్షణలో..
లాంగ్ జంప్ దిగ్గజం అంజు బాబి జార్జ్ శిక్షణలో రాటుదేలిన శైలి.. వచ్చే పోటీల్లో కచ్చితంగా పసిడి పడతానని అంటున్నది. ‘స్వర్ణం నెగ్గి జాతీయ గీతం ఆలపించమని మా అమ్మ చెప్పి పంపింది. ఒక్క సెంటీమీటర్తో పసిడి కోల్పోయా. నాకు ఇంకా పదిహేడేండ్లే. వచ్చే పోటీల్లో కచ్చితంగా పతకం రంగు మారుస్తా. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్లోనూ ఇదే జోరు కొనసాగిస్తా’ అని శైలి చెప్పింది. అంజు మాట్లాడుతూ.. ‘శైలికి రజతం నచ్చదు. ఆమె ఏ పోటీల్లో బరిలోకి దిగినా స్వర్ణం కోసమే ప్రయత్నిస్తుంది’ అని చెప్పింది.