జనగామ, ఏప్రిల్ 29, నమస్తే తెలంగాణ : జిల్లాలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా మరణాలతో భయాందోళనకు గురవుతున్న ప్రజలు వ్యాక్సినేషన్ కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వ దవాఖానలకు తరలివస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాల్లో పేర్లు నమోదు చేయించుకుని టీకా తీసుకునేందుకు జనం బా రులు తీరుతున్నారు. మరోవైపు స్పల్ప లక్షణాలు కనిపించిన పలువురు కొవిడ్ నిర్ధారణ పరీక్ష చే యించుకునేందుకు ముందుకు వస్తుండడంతో అటు పరీక్షలు, ఇటు టీకాల కోసం వచ్చే వారితో జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖాన కిటకిటలాడుతున్నది. ఇప్పటి వరకు జిల్లాలో 10,481 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. పరీక్షలు చేస్తున్న కేసుల్లో సగానికి పైగా పాజిటివ్, యాక్టివ్ కేసులుగా తేలుతుండడంతో గురువారం కరోనా పరీక్షలను సగానికి తగ్గించారు. ప్రతిరోజూ జిల్లాలో 1500కు పైగా జరిగే పరీక్షలు ఇప్పుడు 700కు కుదించి స్పల్ప లక్షణాలున్న వారికి మందులు ఇచ్చి పంపుతున్నారు.
వైద్యు లు, సిబ్బంది కొరతకు తోడు ఆక్సిజన్ లేకపోవడంతో రెండు రోజుల క్రితం పసికందు మృతి చెందగా, తాజాగా మరో గర్భిణి ప్రసవం కాకుండానే గర్భంలో శిశువు మృతి చెందింది. సర్జరీలు చేస్తే ఆక్సిజన్ అవసరమున్న దృష్ట్యా చాలా మంది గర్భిణులు, రోగులను వరంగల్, హైదరాబాద్ రెఫర్ చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. జిల్లాలో కరోనా బాధితుల సం ఖ్య పెరుగుతుండడంతో జిల్లా ప్రధాన ఆస్పత్రి సహా ఇతర నిర్ధారణ కేంద్రాల వద్ద వ్యాక్సిన్, కరోనా పరీక్షల కోసం జనం జనం రద్దీగా ఉంటున్నారు. కరోనా సోకిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి మందులు వాడాలి? వంటి సమస్యలు, సలహాల కోసం 104 కాల్ సెంటర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ప్రైవేట్ దవాఖానలు, ల్యాబొరేటరీల వల్ల సమస్యలు ఎదురైతే టోల్ఫ్రీ నంబర్ 8247847692 నంబర్కు ఫిర్యాదు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. రెండురోజుల వ్యవధిలోనే కరోనాతో 10 మంది మృత్యువాత పడగా, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తున్నది. అయినా కరోనా బాధితులకు డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.