విజయోత్సవ ర్యాలీలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అమ్రాబాద్ మార్చి 29: సముద్రమట్టానికి 680 అడుగుల ఎత్తులో ఉన్న నల్లమలలో వెనుకబడిన ప్రాంతమైన అమ్రాబాద్, పదర మండలాల్లో ప్రతి గుంటకూ సాగునీరు అందే లా కృషిచేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల అన్నారు. శ్రీలక్ష్మీ చెన్నకేశవ లిఫ్ట్ ద్వారా 1.4 టీఎంసీలు అందించేందుకుగానూ సర్వే పనులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మన్ననూర్ నుంచి రాయలగండి లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మన్ననూర్, అమ్రాబాద్, మాచారం, మొ ల్కమామిడి కుమ్మరోనిపల్లి గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం గువ్వల మాట్లాడు తూ అసెంబ్లీలో సమయం దొరికినప్పుడల్లా నల్లమల అభివృద్ధ్ది కోసం మాట్లాడానని, ఈ ప్రాంతంపై తనకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. గత పాలకులు ఈ ప్రాంతానికి నీరే రాదని ఎద్దేవా చేశారని, ముఖ్యమంత్రి స్ఫూర్తితోనే ఈ ప్రాజెక్ట్కు రూపకల్పన చేసి ప్రకటన చేయించానన్నారు. అంతకుముందు కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మన్ననూర్ నుంచి ర్యాలీగా రాయలగండి లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు.
మేలో భూమిపూజకు సీఎం రాక
మే నెలలో స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి భూమిపూజ చేస్తారని గువ్వల తెలిపారు. సర్వే పనులు ప్రారంభమయ్యాయని, ఎన్నికల హామీని నిలబెట్టుకున్నానని తెలిపారు. తెలంగాణ నల్లమలకు ప్రత్యేక గుర్తింపు తేవడమే తన ఆశయమని, ఇందుకు ప్రజల మద్దతు కావాలని కోరారు. ఇక్కడి రైతుల సంతోషమే ముఖ్యమన్నారు. ఘనస్వాగతం పలికిన కార్యకర్తలకు, రైతాంగానికి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆయన సతీమణి గువ్వల అమల, నాయకులు రవీందర్రెడ్డి, చెన్నకేశవులు, శ్రీరాం, జావిద్, జగన్గౌడ్, తిరుమలయ్య, శ్రీనివాసులు, జంగయ్య, విష్ణుమూర్తి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.