లండన్: ఇంగ్లండ్ ఫుట్బాల్ జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 55 ఏండ్లలో తొలిసారి మేజర్ టోర్నీ టైటిల్ పోరుకు చేరింది. యూరో చాంపియన్షిప్ సెమీఫైనల్ ఆఖరి నిమిషాల్లో హ్యారీ కేన్ గోల్ బాదడంతో ఇంగ్లిష్ జట్టు టైటిల్ కోసం ఇటలీతో యుద్ధానికి సిద్ధమైంది. గురువారం ఇక్కడి వెంబ్లే స్టేడియం వేదికగా జరిగిన యూరో సెమీస్లో ఇంగ్లండ్ 2-1 తేడాతో డెన్మార్క్ను అనూహ్య రీతిలో ఓడించింది. మ్యాచ్ 30వ నిమిషంలో మికెల్ డమ్స్గార్డ్ గోల్ బాదడం డెన్మార్క్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత తొమ్మిది నిమిషాల్లోనే అనూహ్య పరిణామం జరిగింది.
డెన్మార్క్ కెప్టెన్ సిమోన్ క్జేర్ పొరపాటున తమ నెట్లోకే బంతిని పంపడంతో ఇంగ్లండ్ ఖాతాలో గోల్ చేరి స్కోర్లు సమమయ్యాయి. ఇంగ్లిష్ ప్లేయర్ సాకా బంతిని బలంగా బాదగా.. దాన్ని ఆపే క్రమంలో సిమోన్ తప్పిదం చేసి ఓన్గోల్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత రెండో అర్ధభాగంలో ఇంగ్లండ్ దూకుడుగా ఆడినా గోల్ నమోదు కాలేదు. అయితే అదనపు సమయంలో ఇంగ్లండ్కు పెనాల్టీ అవకాశం రావడంతో కథ మారిపోయింది.
స్టార్ స్ట్రైకర్ కేన్ (104వ నిమిషం) పెనాల్టీని తొలుత నేరుగా డెన్మార్క్ గోల్కీపర్ వైపు బాదినా.. మళ్లీ వెంటనే తేరుకొని తన వద్దకే వచ్చిన బంతిని గోల్ పోస్ట్లోకి తరలించి జట్టును గెలిపించాడు. దీంతో ఇంగ్లండ్ అభిమానులు సంబురాలు చేసుకున్నారు. సొంతగడ్డపై 1966 ఫిఫా ప్రపంచకప్ గెలిచాక మళ్లీ ఏ మేజర్ టోర్నీలోనూ కనీసం ఫైనల్ చేరలేకపోయిన ఇంగ్లిష్ జట్టు.. మళ్లీ ఇన్నేండ్ల తర్వాత ఓ టైటిల్ పోరులో అడుగుపెట్టింది. మరోవైపు ఈ పరాజయంతో డెన్మార్క్ 33 మ్యాచ్ల అజేయ యాత్రకు బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే పెనాల్టీని అడ్డుకునే క్రమంలో డెన్మార్క్ గోల్కీపర్ కాస్పర్ స్కీమిచెల్స్ను లక్ష్యంగా చేసుకుంటూ ఇంగ్లండ్ అభిమాని లేజర్ లైట్ వినియోగించడం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరలైంది.