తొలిదశ స్ఫూర్తితో కట్టుదిట్టమైన చర్యలు
అనుమానితులకు కరోనా పరీక్షలు
నేటి నుంచి 45ఏండ్లు పైబడిన వారికి టీకా
మాస్క్ ధరించని ప్రతిఒక్కరికీ జరిమానా
అవసరమైతేనే ప్రజలు బయటికిరావాలి
కలెక్టర్ అనితారామచంద్రన్
భువనగిరి అర్బన్, మార్చి 31: అధికారులు సమన్వయంతో పనిచేసి కొవిడ్ ఉధృతిని అరికట్టాలని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. బుధవారం కొవిడ్ ఉధృతిపై ఆయా శాఖల అధికారులతో ఆమె గూగుల్ మీట్ ద్వారా మాట్లాడారు. కొవిడ్ తొలిదశలో ఏవిధమైన చర్యలు చేపట్టారో, రెండో దశలో కూడా అదే స్ఫూర్తితో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనుమానితులకు కరోనా పరీక్షలు చేయించి హోంక్వారంటైన్లో ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్లను గుర్తించాలని సూచించారు. నేటి నుంచి 45 సంవత్సరాలు పైబడిన వారు టీకా వేయించుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ టీకా వేసేందుకు చర్యలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. మాస్కులేని వారికి జరిమానా విధించాలని, ఈ విషయాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు. పండుగలు, శుభకార్యాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జర్నలిస్టులకు కరోనా సోకడం బాధాకరం
జర్నలిస్టులకు కరోనా సోకడం బాధాకరమని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. జర్నలిస్టులు రోజు వారి విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కు ధరించి, భౌతికదూరం పాటించడంతోపాటు శానిటైజర్ వాడాలన్నారు.