న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్తో వణికిపోతున్న ఇండియన్లకు రిలీఫ్.. త్వరలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కోవిడ్-19తో బాధపడే వారికి భారత బీమా నియంత్రణ అభివ్రుద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) తీపి కబురు అందించింది.
వివిధ రోగాలతో ఇంటి వద్దే (హోం ఐసోలేషన్) చికిత్స పొందుతున్న ఖాతాదారులకు ఇన్సూరెన్స్ కవరేజీ కల్పించాలని దేశీయ బీమా సంస్థలను ఐఆర్డీఏఐ ఆదేశించింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న పాలసీలు, కొత్త పాలసీల ద్వారా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని సూచించింది.
ఈ మేరకు హోం ఐసోలేషన్లో చికిత్స పొందే వారికి అనుమతినిస్తూ తమ బీమా ఉత్పత్తుల్లో సవరణలు చేర్చాలని హితవు చెప్పింది. వైద్యుడి సలహా మేరకు హాస్పిటల్లో చికిత్స పొందే వారికే ఇన్సూరెన్స్ కవరేజీ లభిస్తుంది.
ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం సంబంధిత వైద్యుడి సలహా ప్రకారమే రోగికి హోం ట్రీట్మెంట్ కూడా అందిస్తారు. అయితే, ప్రతి రోజూ చికిత్స పురోగతిని సంబంధిత బీమా సంస్థకు నివేదించాల్సిందే.
ఇలా ప్రతి రోజూ వైద్య పరీక్షల నివేదికలను బీమా సంస్థకు పంపాలని ఐఆర్డీఏఐ తెలిపింది. ఆ వైద్య పరీక్షల నివేదికలపై తప్పనిసరిగా సంబంధిత వైద్యుడి సంతకం ఉండాలని వివరించింది.
ప్రస్తుతం అమలులో ఉన్న బీమా ఉత్పత్తులకు అదనపు ప్రీమియం వసూలు చేసిన ఖాతాదారులకు హోం ట్రీట్మెంట్ వసతిని వర్తింప చేయాలని బీమా సంస్థలను ఐఆర్డీఏఐ ఆదేశించింది.
తాజా ఐఆర్డీఏఐ ఆదేశాలపై లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ సీఈవో కం హోల్టైం డైరెక్టర్ రూపం ఆస్తానా స్పందిస్తూ.. హోం కేర్ కవరేజీకి ప్రీమియం నిర్ణయించాలన్నారు. ఇందుకు తమ ముందు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామన్నారు.
కరోనా మహమ్మారి ప్రభావం గరిష్ఠ స్థాయికి చేరుకున్న నేపథ్యంతోపాటు పరిస్థితి తీవ్రంగా లేని రోగులకు ఐఆర్డీఏఐ తాజా నిర్ణయం ఉపకరిస్తుంది. కరోనా మహమ్మారి భవిష్యత్లో వైదొలుగుతున్నదా.. లేదా.. అన్న విషయం తెలియని పరిస్థితి నెలకొంది.
చికిత్స పొందుతున్న రోగులకు హాస్పిటల్ బెడ్స్ రెంటింగ్, ఇతర ఔషధ పరికరాలపై విధించే చార్జీల ఆధారంగా బీమా కవరేజీ ప్రీమియం ఖరారు చేస్తామని ఒక హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ సీనియర్ అధికారి తెలిపారు.