అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ మరోసారి పేలవ ప్రదర్శన చేశారు. నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో బ్యాట్స్మెన్ మరోసారి చేతులెత్తేయడంతో పంజాబ్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. కోల్కతా బౌలర్ల దెబ్బకు పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది. మయాంక్ అగర్వాల్(31: 34 బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్(19), క్రిస్గేల్(0), దీపక్ హుడా(1), నికోలస్ పూరన్(19), హెన్రిక్స్(2), షారుక్ ఖాన్(13) నిరాశపరిచారు. కోల్కతా బౌలర్లు అందరూ సమిష్టిగా పంజాబ్ను బెంబేలెత్తించారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు శుభారంభం లభించలేదు. కోల్కతా అద్భుత బౌలింగ్ ధాటికి ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కమిన్స్ వేసిన ఆరో ఓవర్లో కేఎల్ రాహుల్..మిడాఫ్లో సునీల్ నరైన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పవర్ప్లే ఆఖరికి పంజాబ్ 37/1తో నిలిచింది. శివమ్ మావి వేసిన తర్వాతి ఓవర్లో ఎదుర్కొన్న తొలి బంతికే క్రిస్గేల్ పెవిలియన్ చేరాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన ఎనిమిదో ఓవర్లో ఫామ్లో ఉన్న దీపక్ హుడా మోర్గాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.42/3తో కష్టాల్లో పడిన జట్టును మయాంక్ ఆదుకునే ప్రయత్నం చేశాడు.
జట్టు స్కోరు 60 వద్ద అగర్వాల్ను నరైన్ పెవిలియన్ పంపడంతో పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. మిడిలార్డర్ చేతులెత్తేయడంతో 79 రన్స్కే 6 కీలక వికెట్లు చేజార్చుకుంది. మ్యాచ్పై పట్టుసాధించిన కోల్కతా ఆఖరి వరకు కట్టుదిట్టంగా బంతులేసి పరుగులు రాకుండా నియంత్రించింది. వరుస విరామాట్లో వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ ఏ దశలోనూ పుంజుకోలేదు.గత మ్యాచ్ల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసిన షారుక్ చివర్లో కాస్త ధాటిగా ఆడతాడని భావించినా ఎక్కువసేపు నిలువలేదు. చివరి రెండు ఓవర్లలో క్రిస్ జోర్డాన్ అడపాదడపా బౌండరీలు బాదడంతో జట్టు స్కోరు 120 దాటింది.