ముంబై : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లండ్లో పర్యటించనున్నది. అక్కడ న్యూజిలాండ్ జట్టుతో భారత్ తలపడాల్సి ఉన్నది. డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఇండియా అయిదు టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. అయితే టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడే భారతీయ క్రికెటర్లు ఇప్పటికే కోవిడ్ టీకాలు తీసుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు. 18 ఏళ్ల దాటిన వారు టీకా తీసుకోవచ్చు అని కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన తర్వాత క్రికెటర్లు వ్యాక్సిన్ తీసుకున్నారు.
ముంబైలో రెండు వారాల పాటు క్వారెంటైన్లో ఉండనున్న క్రికెటర్లు.. ఇంగ్లండ్ వెళ్లిన తర్వాత అక్కడ కూడా పది రోజులు క్వారెంటైన్లో ఉంటారు. అయితే తొలి డోసు తీసుకున్న క్రికెటర్లకు.. రెండవ డోసు టీకాలను బ్రిటన్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇవ్వనున్నది. బ్రిటన్ ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కోహ్లీ బృందం రెండవ డోసు టీకాలను వేయించుకుంటుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇంగ్లండ్ వెళ్లే ఆటగాళ్లకు మూడుసార్లు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించేందుకు కూడా బీసీసీఐ ఏర్పాట్లు చేసింది.