టోక్యో: ఈ భూమిపై అతిపెద్ద క్రీడా సంబురానికి సమయం దగ్గర పడింది. మరికొన్ని గంటల్లోనే జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ గేమ్స్ కోసం ఈసారి ఇండియా అతిపెద్ద టీమ్ను పంపింది. ఏకంగా 127 మంది అథ్లెట్లతో కూడిన బృందం ఈ మెగా ఈవెంట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్లో కేవలం రెండే మెడల్స్ గెలిచి తీవ్రంగా నిరాశ పరిచిన ఇండియా.. ఈసారి వాటి సంఖ్యను రెండంకెలకు పెంచాలని పట్టుదలతో ఉంది. అందుకు తగినట్లే స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ కూడా ఈసారి అత్యధిక సంఖ్యలో మెడల్స్ ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే ఇండియన్ టీమ్ గురించి సమగ్రమైన సమాచారం మీకోసం.
వాళ్లదే అతిపెద్ద టీమ్
టోక్యోలో ఇండియా ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఈక్వెస్ట్రియాన్, ఫెన్సింగ్, హాకీ, గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, జూడో, రోయింగ్, సెయిలింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, వెయిట్లిఫ్టింగ్, రెజ్లింగ్లలో పాల్గొంటోంది. వీళ్లలో మెన్స్, వుమెన్స్ హాకీ టీమ్స్ తర్వాత అత్యధికంగా ఇండియా నుంచి అథ్లెటిక్స్లో 26 మంది పాల్గొంటున్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్లో ఇంత పెద్ద టీమ్ను ఇండియా పంపడం ఇదే తొలిసారి. ఆ తర్వాత 15 మందితో షూటింగ్, 9 మందితో బాక్సింగ్, ఏడుగురితో రెజ్లింగ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తొలిసారి టోక్యో ఒలింపిక్స్లోనే ఫెన్సింగ్, ఈక్వెస్ట్రియాన్ గేమ్స్లోనూ ఇండియా పాల్గొంటోంది. ఫెన్సింగ్లో భవానీ దేవి, ఈక్వెస్ట్రియాన్లో ఫౌవాద్ మీర్జా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఈ గేమ్స్తో మన హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొత్త రికార్డు సృష్టించబోతోంది. ఆమెకివి నాలుగో ఒలింపిక్ గేమ్స్. ఇండియా తరఫున అత్యధిక ఒలింపిక్స్లో పాల్గొన్న మహిళా అథ్లెట్గా ఆమె నిలవనుంది. అంకితా రాణాతో కలిసి సానియా టెన్నిస్ డబుల్స్లో బరిలోకి దిగుతోంది. ఇక ఆమెతోపాటు మరో తెలుగువాడు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ కూడా తన నాలుగో ఒలింపిక్ గేమ్స్లో పాల్గొనబోతున్నాడు. మెన్స్ సింగిల్స్తోపాటు మిక్స్డ్ డబుల్స్లో మానికా బాత్రాతో కలిసి బరిలోకి దిగనున్నాడు.
ఆర్చరీలో అతాను దాస్ తన మూడో ఒలింపిక్స్లో పాల్గొంటుండగా.. అతని భార్య దీపికా కుమారికిది రెండో ఒలింపిక్స్. వీళ్లిద్దరూ సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్లో ఇండియాకు మెడల్స్పై ఆశలు రేపుతున్నారు. అటు రియో గేమ్స్లో సిల్వర్ మెడల్ గెలిచిన పీవీ సింధుకివి రెండో ఒలింపిక్ గేమ్స్. ఈసారి ఆమె గోల్డ్పై కన్నేసింది. ఇక లండన్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచినా.. రియోకు క్వాలిఫై కాలేకపోయిన బాక్సర్ మేరీ కోమ్ తన రెండో ఒలింపిక్స్లో తలపడబోతోంది. మరో బాక్సర్ వికాస్ కృష్ణన్కు ఇవి మూడో ఒలింపిక్స్. అటు గోల్ఫ్లో అనిర్బన్ లాహిరి, అదితి అశోక్.. రెజ్లింగ్లో వినేష్ ఫోగాట్ కూడా తమ రెండో ఒలింపిక్స్ బరిలో ఉన్నారు.
రియో ఒలింపిక్స్లో ఇండియా తీవ్రంగా నిరాశపరిచింది. బ్యాడ్మింటన్లో సింధు సిల్వర్ మెడల్, రెజ్లింగ్లో సాక్షి మాలిక్ బ్రాంజ్ మెడల్ గెలిచారు. ఇక ఏ గేమ్లోనూ మెడల్స్ రాలేదు. కానీ ఈసారి మాత్రం చరిత్రను తిరగరాసే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. ఏ గేమ్స్లో ఇండియాకు మెడల్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూద్దాం.
ఆర్చరీ: వరల్డ్ నంబర్ వన్ దీపికా కుమారి సింగిల్స్ ఈవెంట్స్లో మెడల్పై ఆశలు రేపుతోంది. మిక్స్డ్ డబుల్స్లో భర్త అతాను దాస్తో బరిలోకి దిగుతుండటంతో అక్కడా మరో మెడల్ ఖాయంగా కనిపిస్తోంది. ఈ మధ్య జరిగిన వరల్డ్కప్ స్టేజ్ 3లో ఈ ఇద్దరూ టీమ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్స్ సాధించారు.
బ్యాడ్మింటన్: ఈ గేమ్లో పీవీ సింధు ఓ మెడల్ తీసుకురావడం దాదాపు ఖాయం. అయితే రియోలో సిల్వర్ గెలిచిన ఆమె.. ఈసారి గోల్డ్ గెలుస్తుందా లేదా చూడాలి.
బాక్సింగ్: 52 కేజీల కేటగిరీలో వరల్డ్ నంబర్ అమిత్ పంఘాల్ నంబర్ వన్ సీడ్గా బరిలోకి దిగుతున్నాడు. అతడు కచ్చితంగా మెడల్ గెలుస్తాడన్న అంచనాలు ఉన్నాయి. మరోవైపు తన చివరి గేమ్స్లో ఆడుతున్న 38 ఏళ్ల మేరీకోమ్ కూడా మెడల్ ఫేవరెట్స్లో ఉంది.
రెజ్లింగ్: ఈసారి రెజ్లింగ్లో కనీసం రెండు మెడల్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి. భజరంగ్ పూనియా, వినేష్ ఫోగాట్ మెడల్స్ రేసులో ఉన్నారు. 65 కేజీల కేటగిరీలో భజరంగ్, 53 కేజీల కేటగిరీలో వినేష్ టాప్ సీడ్స్గా బరిలో దిగుతున్నారు.
హాకీ: ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంత టాప్ ఫామ్లో ఉంది మెన్స్ హాకీ టీమ్. ఒలింపిక్స్లో అత్యధికంగా 8 గోల్డ్ మెడల్స్ గెలిచిన చరిత్ర ఉన్న ఇండియన్ మెన్స్ హాకీ టీమ్.. ఈసారి మెడల్పై కన్నేసింది.
షూటింగ్: ఈ గేమ్లోనే ఇండియా చాలా మెడల్స్ ఆశిస్తోంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ మిక్స్డ్ డబుల్స్లో సౌరభ్ చౌదరి, మను బాకర్ గోల్డ్ మెడల్ ఫేవరెట్గా ఉన్నారు. ఇక ఇదే ఈవెంట్లో అభిషేక్ వర్మ, యశస్విని సింగ్ కూడా మెడల్ పోటీలో ఉన్నారు. ఇక 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత కేటగిరీలో వరల్డ్ నంబర్ వన్ ఎలవెనిల్ వేలరివన్, అపూర్వ చండేలా, సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను బాకర్, యశస్వి.. మహిళల 25 మీటర్ల పిస్టల్లో బాకర్, రాహి సర్నోబత్ కూడా మెడల్స్ రేసులో ఉన్నారు.
వెయిట్లిఫ్టింగ్: 49 కేజీల కేటగిరీలో తలపడుతున్న మీరాభాయ్ చాను వెయిట్లిఫ్టింగ్లో మెడల్పై ఆశలు రేపుతోంది. రెండో సీడ్గా బరిలోకి దిగుతున్న ఆమె తన ఫామ్ను కొనసాగిస్తే.. ఒలింపిక్స్లో రెండో మెడల్ గెలిచే చాన్స్ ఉంటుంది.
అథ్లెటిక్స్: ఈసారి ఇండియా అతిపెద్ద టీమ్ను పంపిస్తున్నా.. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా మాత్రమే మెడల్ రేసులో ఉన్నాడు. ఇప్పటివరకూ అత్యధికంగా 88.07 మీటర్ల దూరం విసిరిన అతడు.. దానిని మరింత మెరుగు పరచుకొని మెడల్ గెలవాలని చూస్తున్నాడు.
టోక్యో ఒలింపిక్స్లో ఈసారి నలుగురు తెలుగువాళ్లు బరిలో ఉన్నారు. బ్యాడ్మింటన్ సింగిల్స్లో పీవీ సింధు, సాయి ప్రణీత్.. మెన్స్ డబుల్స్లో సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, టెన్నిస్లో సానియా మీర్జా టోక్యో ఒలింపిక్స్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వీళ్లలో సింధు కచ్చితంగా మెడల్ సాధించే అవకాశాలు ఉండగా.. రికార్డు స్థాయిలో నాలుగో ఒలింపిక్స్లో ఆడుతున్న సానియా మీర్జా కూడా వుమెన్స్ డబుల్స్లో అంకితా రాణాతో కలిసి మెడల్ గెలవాలని చూస్తోంది. బ్యాడ్మింటన్లో సాయి ప్రణీత్కు డ్రా అనుకూలంగానే ఉన్నా.. తర్వాతి స్టేజ్లలో గట్టి ప్రత్యర్థులు ఎదురవుతున్నారు.