సిద్దిపేట, జులై 4 : ప్రజల మేలు కోసమే ప్రభుత్వం పట్టణ ప్రగతిని చేపట్టిందని, సిద్దిపేట ప్రజల భాగస్వామ్యంతో పట్టణాన్ని చెత్త రహిత, స్వచ్ఛ, శుద్ధి పేటగా చేయాలన్నదే తన తాపత్రయమని ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట 6వ వార్డులోని గ్రీన్లాండ్ కాలనీలో మొక్కలు నాటి సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 25వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. 2వ వార్డు నర్సపురంలో గాంధీ సర్కిల్ నుంచి ఎస్సీ కాలనీ వరకు రూ.25 లక్షలతో నిర్మించే బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయా సమావేశాల్లో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతో పట్టణాన్ని స్వచ్ఛపట్టణంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. సిద్దిపేటలో రాష్ట్రంలోనే మొదటిసారిగా చెత్తను రూ.4.30 కోట్లతో చెత్తను నుంచి గ్యాస్ తయారు చేసే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తున్నామన్నారు. చెత్తతో ఆదాయం పొందేలా ఆలోచనలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే మొదటి సారిగా సిద్దిపేటలో స్వచ్ఛబడి ఏర్పాటు చేశామని, చెత్త గురించి ఇక్కడ పాఠాలు నేర్పిస్తారన్నారు. ఎన్నికలప్పుడు కాదు.. తర్వాత కూడా మీ సేవ చేయడమే మా బాధ్యత అని చెప్పారు. యువత కోసం ఓపెన్ జిమ్, లైబ్రరీ కట్టిస్తామన్నారు. రూ.15 లక్షలతో మహిళా సమాఖ్య భవనం, మరో రూ.15 లక్షలతో కుమ్మరి సంఘం భవనాల కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నర్సపురంలో వారం రోజుల్లో వైకుంఠధామ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు.
నేరుగా ప్రజలతో ముచ్చట..
25వ వార్డులో నిర్వహించిన సభలో మంత్రి హరీశ్రావు ప్రజల సమస్యలను నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. అక్కడికక్కడే సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. కాలనీలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారం మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్ల సమక్షంలోనే ప్రజలు తెలిపిన సమస్యలకు సమాధానం రాబట్టారు. ప్రజలకు ఏ అవసరం ఉంటే ఆ పనులు చేయడమే ప్రజాప్రతినిధుల లక్ష్యమని మంత్రి అన్నారు. చెత్త సేకరణకు మరో 6 వాహనాలు కావాలని కమిషనర్ మంత్రి, దృష్టికి తీసుకరాగా, వెంటనే వాహనాలు తేవాలని సూచించారు. చెత్త సేకరణ అంశంలో ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే మీరే బాధ్యులు అవుతారని అధికారులకు హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు, కమిషనర్ రమణాచారి, కౌన్సిలర్లు సాయికుమార్, ప్రవీణ్కుమార్, చంద్రం, గుండ్ల యోగి, మాజీ కౌన్సిలర్లు నర్సయ్య, సత్యనారాయణతో సుడా డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి, నాయకులు లోక లక్ష్మిరాజ్యం, శ్రీనివాస్గౌడ్, కోరె ఎల్లయ్య, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు రామేశ్వర్తో పాటు ఆయా శాఖల అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.