న్యూఢిల్లీ : భారత్ లో కరోనా వైరస్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రాలు, జిల్లాల వారీగా కొవిడ్-19 పరిస్థితిపై సమీక్షించారు. కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్నందున దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరు తగ్గకుండా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని కోరారు. లాక్ డౌన్ లు అమల్లో ఉన్నా ప్రజలు వ్యాక్సిన్ వేసుకునేందుకు వెనకాడరాదని, వ్యాక్సినేషన్ డ్యూటీలో ఉన్న ఆరోగ్య సిబ్బందిని వేరే విధులకు మళ్లించరాదని సూచించారు.
ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రాష్ట్రాలకు సహకరించాలని అధికారులు, కేంద్ర మంత్రులను కోరారు. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయని ప్రధానికి అధికారులు వివరించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల వివరాలను నివేదించారు. కరోనా చికిత్సలో ఉపయోగించే మందుల లభ్యతను ప్రధాని సమీక్షించారు. రెమ్డిసివిర్ సహా కరోనా ఔషధాల ఉత్పత్తిని పెంచినట్టు అధికారులు ప్రధానికి వివరించారు.