అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి ధనాధన్ బ్యాటింగ్తో అదరగొట్టాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో ఆరంభం నుంచి ఆఖరి వరకు క్రీజులో నిలబడి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా బెంగళూరు బౌలర్లను ధాటిగా ఎదుర్కొని మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగాడు.
రాహుల్(91 నాటౌట్: 57 బంతుల్లో 7ఫోర్లు, 5సిక్సర్లు ) సూపర్ హాఫ్సెంచరీతో రాణించడంతో పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. హార్డ్హిట్టర్ క్రిస్గేల్(46: 24 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆఖర్లో హర్ప్రీత్ బ్రార్(25 నాటౌట్: 17 బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు) ఆకట్టుకున్నాడు.
మిగతా బ్యాట్స్మెన్ కనీసం క్రీజులో నిలవలేకపోయారు. ప్రభు సిమ్రాన్ సింగ్(7), నికోలస్ పూరన్(0), దీపక్ హుడా(5), షారుక్ ఖాన్(0) నిరాశపరిచారు. రాహుల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి జట్టుకు మంచి స్కోరు అందించాడు. బెంగళూరు బౌలర్లలో జేమీసన్ రెండు వికెట్లు తీయగా డేనియల్ సామ్స్, యుజువేంద్ర చాహల్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.