మండల ప్రత్యేక అధికారి కృష్ణమాచారి
కోస్గి, మే 4: కరోనా మహమ్మారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి కృష్ణమాచారి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం మండలంలోని చంద్రవంచ, నాచారం గ్రామాల్లో టాస్క్ఫోర్స్ బృందంతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సైతం కరోనా మహమ్మారి విస్తరిస్తుందని స్వీయ నియంత్రణతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా బారినపడిన ప్రజలు దవాఖానల్లో బెడ్లు దొరకక, ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారని ప్రతిరోజు అవగాహన కల్పించినా వేల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రజలు అత్యవసర సమయాల్లో తప్ప బయకు రావొద్దన్నారు. కార్యక్రమంలో ఏఎస్సై ఆరీఫ్ ఆయా గ్రామాల సర్పంచ్లు, టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
నర్వ, మే 4: మండలంలోని పీహెచ్సీలతోపాటు మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది. ఆన్లైన్లో రెండో డోసు టీకాకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మంగళవారం టీకా ఇచ్చినట్లు డాక్టర్ ఫాతిమా తెలిపారు. ఈ సం దర్భంగా డాక్టర్ మాట్లాడుతూ మండలంలోని 45 సంవత్సరాలు నిండినవారు కొవిడ్ టీకాను తీసుకోవడానికి ముందుకు రావాలని, ఇప్పటి దాకా ఈ టీకా తీసుకున్నవారికి ఏ విధమైన అనారోగ్య సమస్యలు తలెత్తలేదన్నారు.
కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలు
కృష్ణ, మే 4 :కరోనా సెకండ్వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో మండల కేంద్రంతోపాటు ముడుమాల, కున్సి, మురహరిదొడ్డి, తదితర గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. మురుగుకాల్వల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి, మొరం వేసి చదును చేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందడంతో ప్రజలు బయట తిరగకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.