ప్రభాస్ గురించి బాగా తెలిసిన వాళ్లు చెప్పే ఒకే ఒక మాట.. ఆయన చాలా మొహమాటస్తుడు అని. ఎవరితో ఎక్కువగా మాట్లాడడు అని. తెలిసిన వాళ్లతో తప్ప బయట వాళ్లతో పెద్దగా కలవడు ప్రభాస్. ఆయన ప్రపంచం కూడా చాలా చిన్నగా ఉంటుంది అని చెప్తారు తెలిసిన వాళ్లు. అయితే ఇదంతా రియల్ లైఫ్లో మాట.. కానీ ఆయన స్క్రీన్ మీద కూడా అంతే సిగ్గరి. ఏదైనా రొమాంటిక్ సన్నివేశాలు చేయాల్సిన సమయంలో చాలా అంటే చాలా మొహమాటపడతాడు ప్రభాస్. ఇదే విషయం దర్శక ధీరుడు రాజమౌళి కూడా చెప్పాడు. బాహుబలి సమయంలో తనకు యాక్షన్ సన్నివేశాలు చేయడంలో పెద్దగా కష్టం అనిపించలేదు కానీ ప్రభాస్తో రొమాన్స్ చేయించడానికి మాత్రం చాలా కష్టపడ్డాను అని చెప్పాడు.
ప్రభాస్ ఎంత మొహమాటస్తుడు అని చెప్పడానికి ఒక సంఘటన ఇప్పుడు బయటికి వచ్చింది. ఆయన స్నేహితుడు, మేనేజర్,నటుడు అయిన ప్రభాస్ శీను ఒక ఇంటర్వ్యూలో యంగ్ రెబల్ స్టార్ గురించి చాలా విశేషాలు చెప్పాడు. ముఖ్యంగా ఆయనలో ఉన్న సిగ్గు గురించి ప్రత్యేకంగా చెప్పాడు శీను. అప్పట్లో ఒక సినిమాలో ముద్దు సన్నివేశంలో నటించడానికి తన తండ్రికి ఫోన్ చేసి అనుమతి తీసుకున్నాడని ప్రభాస్ గురించి అదిరిపోయే న్యూస్ చెప్పాడు. 2003లో బి.గోపాల్ తెరకెక్కించిన అడవి రాముడు సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ సినిమా యావరేజ్గా ఆడింది. ఇందులో ఆర్తి అగర్వాల్తో ఒక ముద్దు సన్నివేశంలో నటించాడు ప్రభాస్. అయితే ఈ సన్నివేశంలో నటించాల్సి ఉండగా ముందు తన తండ్రి సూర్యనారాయణ రాజు దగ్గర అనుమతి తీసుకున్నాడు ప్రభాస్.
ఆయనకు లొకేషన్ నుంచి ఫోన్ చేసి ఇలా ఒక సన్నివేశం ఉంది నటించమంటారా నాన్నగారు అంటూ అనుమతి తీసుకున్నాడని.. తండ్రి నుంచి అనుమతి వచ్చిన తర్వాతే ఆ సన్నివేశంలో ప్రభాస్ నటించాడని శీను తెలిపాడు. ప్రభాస్కు తన తల్లిదండ్రులు అంటే అంత గౌరవం ఉంది అని చెప్పుకొచ్చాడు. ఎంత ఇమేజ్ పెరిగిన.. ఎంత మార్కెట్ పెరిగిన ప్రభాస్ ఇప్పటికీ అంతే ఒద్దికగా ఉన్నాడని.. డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్ శీను. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, సలార్, అదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి