ప్రజల ప్రాణాలు కాపాడేవారే నిజమైన డాక్టర్లు
చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి
కరోనా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఫైనల్ ఇయర్ వైద్యవిద్యార్థులతో మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 26 : పేదలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తేనే సమాజంలో మంచి డాక్టర్గా గుర్తింపు వస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం మహబూబ్నగర్ ప్రభు త్వ జనరల్ దవాఖానలో ఫైనల్ ఇయర్ వైద్య విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత మెడికల్ కళాశాల కల సాకారమైందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి వైద్య కళాశాలను పాలమూరుకు సీఎం కేసీఆర్ మంజూరు చేశారన్నారు. ప్రజల పన్నులు, డబ్బులతో మీరు వైద్యవిద్య అభ్యసించారని, ప్రజల ప్రాణాలు కాపాడుతారని సీఎం కేసీఆర్ వైద్య విద్యార్థులకు ఎన్నో వసతులు, హాస్టల్స్, కళాశాల భవనం ఏర్పాటు చేశారన్నారు.
వైద్య వృత్తిలో నిర్లక్ష్యం చేయకుండా, క్రమశిక్షణతో వైద్యసేవలు అందించాలని సూచించారు. సీనియర్ వైద్యులతో తెలియని విషయాలు తెలుసుకొని సేవలపై దృష్టి సారించాలన్నారు. మన కండ్లముందే ఎంతోమంది కరోనాతో చనిపోతున్నారని, కరోనాతో చనిపోతే తల్లిదండ్రులు కూడా వదిలిపోయే పరిస్థితి మీరు చూస్తున్నారన్నారు. సమాజంలో ఒకసారి ఆలోచన చేసుకొని మీరు సేవలందించాలని తెలిపారు. పాలమూరులో నాలుగు బస్తీ దవాఖానల్లో కూడా వైద్య సేవలందించేందుకు చర్య లు తీసుకుంటున్నామని తెలిపారు. హౌస్ సర్జన్లకు అని రకాల వసతులు కల్పిస్తామన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా భయపడకుండా వైద్యసేవలు అందించాలని సూచించారు. సమావేశంలో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, డిప్యూటీ సూపరిటెండెంట్లు డాక్టర్ జీవన్, డాక్టర్ నర్సింహరావు, మెడికల్ కళాశాల ఎస్పీఎం డాక్టర్ కిరణ్ప్రకాశ్, డీఎస్పీ శ్రీధర్ ఉన్నారు.
కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి
నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని బుధవారం పరిశీలించారు. కలెక్టరేట్లో అంతర్గత రహదారులతోపాటు, భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని సూచించారు. మంత్రివెంట ఆర్అండ్బీ ఇంజినీరు కేవీఎన్ స్వామి, ఈఈ సంధ్య, ఏఈ ప్రశాంత్రెడ్డి ఉన్నారు.