అభివృద్ధి సంక్షేమాలకు సమప్రాధాన్యమిస్తూ ముందుకుపోతున్న రాష్ట్రప్రభుత్వ విధానాన్ని 2021-22 తెలంగాణ వార్షిక బడ్జెట్ ప్రతిఫలించింది. కరోనా కష్టకాలంలో, ఆదాయ వనరులు పడిపోయిన పరిస్థితుల్లో కూడా మున్నెన్నడూ లేనిస్థాయిలో రెండు లక్షల ముప్ఫై వేల 825 కోట్ల భారీ బడ్జెట్ను రూపొందించటం ముదావహం. రాష్ట్ర అవతరణ నుంచి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం సుస్థిరాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది. నిధుల కేటాయింపుల్లో సర్వజన సంక్షేమం కనిపిస్తున్నది. అలాగే వివిధ సామాజిక వర్గాల అభ్యున్నతికి గత ఏడాది కేటాయింపులకంటే ఈసారి భారీగా నిధులు పెరిగాయి. గత ప్రభుత్వాల హయాంలో బడ్జెట్ పద్దులు అంటే ఏదో అంకెల గారడీ. మొక్కుబడి కేటాయింపులతో జనాన్ని మభ్యపెట్టి కాలం గడిపే పద్ధతి ఉండేది. అలాకాకుండా ఈ వార్షిక బడ్జెట్లో నిర్దిష్ట లక్ష్యాల సాధన, అవసరాల ప్రాతిపదికన కేటాయింపు అడుగడుగునా కనిపిస్తున్నది.
రాష్ట్రంలో ప్రధాన ఆదాయ వనరైన వ్యవసాయరంగానికి బడ్జెట్లో సర్కార్ పెద్దపీట వేసింది. యంత్రాల అభివృద్ధికి, ఆధునికీకరణకు ప్రత్యేక నిధులు కేటాయించింది. రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా కోసం నిధులు పెరిగాయి. విద్య, వైద్య రంగాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే పయనం కనిపిస్తున్నది. నాలుగువేల కోట్లతో బృహత్తర విద్యాపథకం రూపొందనున్నది. పాఠశాల, ఉన్నత విద్యకోసం నిధుల కేటాయింపులు పెరిగాయి. తొలిసారి జిల్లా, మండల పరిషత్లకూ అభివృద్ధి నిధులు అందనున్నాయి. మూసీ సుందరీకరణ, మెట్రోరైలు, రీజినల్ రింగ్రోడ్లాంటి వాటికి ప్రాధాన్యమిస్తూనే రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన వరంగల్, ఖమ్మం తదితర కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తగిన ప్రాధాన్యం లభించింది.
సమాజంలోని అన్నివర్గాల సంక్షేమం పట్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నది. వెనుకబడిన, నిమ్న వర్గాల అభ్యున్నతిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. మహిళలకు వడ్డీలేని రుణాలు మొదలు బీసీలు, ఎంబీసీల కోసం భారీగా నిధులు పెంచింది. బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీకలుగా ఆయా వర్గాలపేరిట ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో వారి సంక్షేమం కోసం మరిన్ని కేటాయింపులు చేసింది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం పెద్దమొత్తంలో నిధులు పెరిగాయి. ప్రత్యేకంగా దళితుల కోసం సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి రూపకల్పన చేసింది. సమస్త వర్గాల సమున్నత అభివృద్ధికోసం చాలినన్ని నిధులతో రూపొందించిన ఈ వార్షిక బడ్జెట్ ప్రజాసంక్షేమ అభివృద్ధి ప్రణాళికగా చెప్పుకోవచ్చు.