మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను. ఈ రాబడి ఆధారంగానే నగరంలో వివిధ అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-2021) ఆస్తిపన్ను మార్చి నెలాఖరు వరకు లక్ష్యం మేరకు వసూలైంది. ఏప్రిల్ 1 నుంచి ఆస్తిపన్ను చెల్లింపుదారులకు 5 శాతం రాయితీ కల్పిస్తూ ఎర్లీబర్డ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. వాస్తవానికి గతనెల 30తోనే గడువు ముగిసినా కరోనా విపత్కర పరిస్థితి కావడంతో నెలాఖరు వరకు పొడిగించారు. ఈనెలలో నగరవ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటివరకు రూ.59 కోట్లు సమకూరాయి. కార్యాలయాలకు రాకుండా ఆన్లైన్ లేదా జీహెచ్ఎంసీ యాప్లో కూడా ఆస్తిపన్ను చెల్లించొచ్చని బల్దియా అధికారులు సూచించారు. ఇక ట్రేడ్ లైసెన్స్ల పునరుద్ధరణపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపింది. గ్రేటర్లో మొత్తం 1,66,408 ట్రేడ్ లైసెన్స్లుండగా ఇప్పటివరకు 38,299 మంది మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. జూన్ 1 నుంచి 50 శాతం అపరాధ రుసుంతో లైసెన్స్ల పునరుద్ధరణ చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
లాక్డౌన్ కొనసాగుతుండడం, సడలింపు సమయంలో రద్దీ ఉంటుండడంతో ఆన్లైన్లోనూ ఆస్తిపన్ను (ప్రాపర్టీ ట్యాక్స్) చెల్లించొచ్చు. జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ లేదా మై జీహెచ్ఎంసీ యాప్లోకెళ్లి పీటీఐ నెంబర్ నమోదు చేస్తేవివరాలు కనిపిస్తాయి. క్రెడిట్, డెబిట్ కార్డు లేదా పేటీఎంల ద్వారా ఆస్తిపన్ను చెల్లించవచ్చు.
సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ ): జీహెచ్ఎంసీ ఎర్లీబర్డ్ పథకం గడువు సమీపిస్తున్నది. మరో తొమ్మిది రోజుల్లో ఆస్తిపన్ను చెల్లింపుపై 5 శాతం రాయితీ ముగియనుంది. వాస్తవానికి ఎర్లీబర్డ్ స్కీం గత ఏప్రిల్ 30 నాటికే అవకాశం ఉండగా కరోనా పరిస్థితుల దృష్టా ఈ నెలాఖరు నాటికి అవకాశం కల్పించింది. ఎర్లీబర్డ్ పథకం ద్వారా మే నెలలో రూ.రూ. 400 కోట్లు రాబట్టాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ నెల 20 వరకు (గురువారం) వరకు కేవలం రూ. 58.08 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇంకా రూ.341 కోట్ల మేర వసూళ్లు రావాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా పడినందునే ఆస్తిపన్ను లక్ష్యం చేరుకోలేకపోయామని అధికారులు చెబుతున్నారు.
వివిధ ఆదాయ మార్గాలను అన్వేసిస్తున్న ఉన్నతాధికారులు తాజాగా అసెస్మెంట్లపై దృష్టి సారించారు. సంస్థ ఖజానాను పటిష్టం చేయడమే లక్ష్యంగా కొత్త ఇండ్ల ఆస్తి పన్నులపై ఫోకస్ పెట్టారు. ప్రతి ఏటా 11 వేల ఇండ్లకు పైగా నిర్మాణ అనుమతులు జారీ అవుతున్నాయి. ఈ నిర్మాణాలు పూర్తయ్యేందుకు ఏడాది నుంచి మూడేండ్లు పడుతోంది. సదరు నిర్మాణం పూర్తి అయితే అప్పటి నుంచి ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ కాగానే జీహెచ్ఎంసీ అధికారులు ఆయా నిర్మాణాల నుంచి ఆస్తిపన్ను వసూళ్లకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆరు వేల ఇళ్లను మదింపు చేశారు. తద్వారా దాదాపు 4 కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకున్నారు.
గ్రేటర్లో ట్రేడ్ లైసెన్స్ల రెన్యువల్పై కరోనా ప్రభావం పడింది. గత మార్చి 31 వరకే ట్రేడర్స్ అందరూ తమ తమ లైసెన్స్లను పునరుద్ధరించుకోవాల్సి ఉంది. కొత్తగా ట్రేడ్ లైసెన్స్ను పొందాల్సి ఉంది. కానీ వాటిని రెన్యువల్ చేసుకునేందుకు ట్రేడర్స్ ముందుకు రావడం లేదు. గ్రేటర్లో మొత్తం 1,66,408 ట్రేడ్ లైసెన్స్లుండగా ఇప్పటి వరకు 38,299 మంది మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు 25 శాతం, మే 31 నుంచి 50 శాతం అపరాధ రుసుంతో జీహెచ్ఎంసీ అధికారులు రెన్యువల్ చేస్తున్నారు. గత ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు కేవలం 18,769 మంది మాత్రమే ట్రేడ్ లైసెన్స్లను పునరుద్ధరించుకున్నారు.
గత ఏడాది నుంచి కరోనా వైరస్ పట్టి పీడిస్తుండడంతో వ్యాపారాలు ఢీలా పడ్డాయి. దీంతో షాపుల అద్దెలు కూడా చెల్లించలేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు తర్వాత క్రమంగా వ్యాపారాలు పుంజుకున్నా తిరిగి మందగించాయి. ఈ నేపథ్యంలోనే ట్రేడ్ లైసెన్స్ను పునరుద్ధరించుకోలేకపోతున్నామని, ప్రభుత్వం ఎలాంటి అపరాధ రుసుం లేకుండా జులై 31 వరకు రెన్యువల్ చేయాలని వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు.