న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సరికొత్త సంస్కరణ తీసుకొచ్చింది. క్రీడలను అభివృద్ధి చేయడంలోనే కాదు తాము ఎంచుకున్న విభాగంలో అత్యుత్తమంగా రాణిస్తున్న ప్లేయర్లు గాయపడితే వారికి అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. టోర్నీల్లో గానీ శిక్షణ సందర్భంగా ఎవరైనా అథ్లెట్లు గాయపడితే ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు కల్పించబోతున్నది. ఇందు కోసం సెంట్రలైజ్డ్ అథ్లెట్ ఇంజ్యూరీ మేనేజ్మెంట్ సిస్టమ్(సీఏఐఎమ్ఎస్)ను తీసుకొచ్చింది. దీని ద్వారా గాయపడిన ప్లేయర్లకు అత్యుత్తమ వైద్యం, చికిత్స, పునరావాస సదుపాయాలు అందిస్తూ వారి రికార్డులను భద్రపర్చనుంది. భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్) ఆధ్వర్యంలో దేశంలోని ప్రముఖ వైద్యుల సహకారంతో సీఏఐఎమ్ఎస్ నడవనుంది. ఈ పద్ధతిని పారిస్(2024) ఒలింపిక్స్ కోసం శిక్షణ పొందుతున్న అథ్లెట్లకు అమలుపరిచి ఆ తర్వాత విస్తరించనున్నారు. శుక్రవారం కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు..సీఏఐఎమ్ఎస్పై వర్చువల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ పాల్గొని తన అభిప్రాయాలను మంత్రితో పంచుకుంది. ఈ సందర్భంగా మంత్రి రిజిజు మాట్లాడుతూ ‘గాయాల వల్ల కెరీర్లు కోల్పోయిన అథ్లెట్లను చూశాను. సరైన సమయంలో వైద్యం అందక అర్ధాంతరంగా కొందరు కెరీర్ ముగించుకున్నారు. ఇలా కాకుడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. దీని ద్వారా అత్యుత్తమ వైద్యం అందించనున్నాం’ అని అన్నారు. సీఏఐఎమ్ఎస్ నిర్ణయాన్ని ఐవోఏ చీఫ్ నరిందర్ బాత్రా అభినందించారు.