న్యూఢిల్లీ: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్గాంధీ ఖేల్ రత్న అవార్డు కోసం తెలుగు రాష్ర్టాలకు చెందిన స్టార్ క్రికెటర్ మిథాలీరాజ్, ఆర్చర్ జ్యోతి సురేఖ నామినేట్ అయ్యారు. అనితరసాధ్యమైన రికార్డులతో భారత్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన హైదరాబాదీ మిథాలీని బీసీసీఐ ప్రతిపాదించనుంది. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి ఇటీవలే 22 ఏండ్లు పూర్తి చేసుకున్న మిథాలీ వన్డేల్లో అత్యధిక పరుగుల(7170) జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. వన్డే ప్రపంచకప్లో రెండుసార్లు(2005, 17) భారత్ను ఫైనల్ చేర్చిన మిథాలీ జట్టులో కీలక ప్లేయర్గా సేవలందిస్తున్నది.
మిథాలీతో పాటు టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ను ఖేల్ రత్న అవార్డుకు ప్రతిపాదిస్తున్నట్లు బోర్డు వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. మరోవైపు అర్జున అవార్డు కోసం కేఎల్ రాహుల్, ధవన్, బుమ్రా పేర్లను బోర్డు సిఫారసు చేయనుంది. ప్రపంచకప్లో మూడు సార్లు రజత పతకం గెలిచిన ఆంధ్రప్రదేశ్ యువ ఆర్చర్ వన్నెం జ్యోతి సురేఖ ప్రతిభను జాతీయ ఆర్చరీ సమాఖ్య ఎట్టకేలకు గుర్తించింది. మిగతా క్రీడాంశాల్లో సునీల్ ఛెత్రీ, శరత్ కమల్, నీరజ్ చోప్రా..ఖేల్ రత్న అవార్డుకు ఆయా జాతీయ సమాఖ్యలు ప్రతిపాదించాయి.
మెరిసిన మిథాలీ
ఇంగ్లండ్తో రెండో వన్డేలో భారత కెప్టెన్ మిథాలీరాజ్(59) అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. మిథాలీతో పాటు షఫాలీవర్మ(44) రాణించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 221 పరుగులు చేసింది. కేట్ క్రాస్ (5/34) ఐదు వికెట్లతో అదరగొట్టింది.