సూర్యాపేట, మార్చి 25 (నమస్తే తెలంగాణ): జాతీయ జూనియర్ కబడ్డీ పోటీల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) బాలుర జట్టు, హర్యానా బాలికల జట్టు విజేతగా నిలిచాయి. సూర్యాపేట వేదికగా గురువారం సాయంత్రం హోరాహోరీగా సాగిన బాలుర ఫైనల్లో సాయ్ 51-27తో ఉత్తరప్రదేశ్ను చిత్తు చేసింది. బాలికల ఫైనల్లో హర్యానా 43-35తో సాయ్ బాలికల జట్టుపై నెగ్గి టైటిల్ కైవసం చేసుకుంది. విజేతలుగా నిలిచిన జట్లకు రూ.3 లక్షలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ. 1.50 లక్షలు, తృతీయ బహుమతిగా రూ. 75 వేలు, నాలుగో స్థానంలో నిలిచిన జట్లకు రూ. 50 వేల నగదును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అందించారు.
యాభై ఏండ్లలో తొలిసారి..
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో ఆయన మాతృమూర్తి సావిత్రమ్మ స్మారకార్థం సూర్యాపేటలో నిర్వహించిన పోటీలు కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమయ్యాయి. హైదరాబాద్ను దాటి జాతీయ స్థాయి కబడ్డీ క్రీడలు జరుగడం యాభై ఏండ్లలో ఇదే తొలిసారి. తొలిరోజు గ్యాలరీ కూలి చిన్నపాటి అపశృతి మినహా మిగిలిన ఏర్పాట్లు అదిరిపోయాయి. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు కల్పించారని పలు రాష్ర్టాలకు చెందిన క్రీడా ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.
అలరించిన లేజర్ షో
క్రీడల ముగింపు ఉత్సవాలు ఎంతగానో అలరించాయి. ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజేషన్ బీ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన లేజర్ షో ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు లింగయ్యయాదవ్, శాసనసభ్యులు గాదరి కిషోర్కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి, జడ్పీ చైర్మన్లు బండ నరేందర్రెడ్డి, గుజ్జ దీపికా, సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.