న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం బీసీసీఐ శుక్రవారం 20 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లకు పెద్ద పీట వేస్తూ టీమ్ను ఎంపిక చేసింది. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను పరిగణనలోకి తీసుకోకపోవడం తప్ప.. ముందు ఊహించిన విధంగానే జట్టు ఎంపిక సాగింది. గాయాల కారణంగా సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగిన సిరీస్కు దూరమైన రవీంద్ర జడేజా, హనుమ విహారి, మహమ్మద్ షమీ తిరిగి జట్టులోకి వచ్చారు.
వచ్చే నెల 18 నుంచి సౌతాంప్టన్ వేదికగా జరుగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు న్యూజిలాండ్తో తలపడనుంది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడటంతో ఇక టీమ్ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్పై దృష్టి పెట్టింది. గతేడాది ఆఖర్లో ఆస్ట్రేలియాను కంగారూ గడ్డపైనే చిత్తు చేసి సిరీస్ నెగ్గిన టీమ్ఇండియా.. స్వదేశంలో ఇంగ్లండ్ను మట్టికరిపించి మంచి ఊపులో ఉంది. ఇదే జోరులో ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన టెస్టు చాంపియన్షిప్లోనూ విజేతగా నిలిచి సుదీర్ఘ ఫార్మాట్లో తమకు తిరుగులేదని నిరూపించాలని కోహ్లీసేన తహతహలాడుతున్నది.
కడుపునొప్పితో తాజా ఐపీఎల్ సీజన్ నుంచి విరామం తీసుకున్న లోకేశ్ రాహుల్తో పాటు కరోనా వైరస్ బారిన పడిన వృద్ధిమాన్ సాహా.. పర్యటనకు ముందే ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని బీసీసీఐ పేర్కొంది. డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఉండటంతో ముందు జాగ్రత్తగా నలుగురు ఆటగాళ్లను స్టాండ్బైగా ఎంపిక చేసింది. ఇందులో అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, అర్జాన్ నాగ్వస్వల్లా ఉన్నారు. ఈ జట్టుకు టీమ్ఇండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సార థ్యం వహించనుండగా.. అజింక్యా రహానే వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
ఆసీస్ పర్యటనలో నిరాశ పరచడంతో జట్టులో చోటు కోల్పోయిన యువ ఓపెనర్ పృథ్వీషాకు సెలెక్టర్లు మరోసారి మొండిచేయి చూపించారు. దేశవాళీల్లో పరుగుల వదర పారించిన పృథ్వీ.. తాజా ఐపీఎల్లోనూ చక్కటి ఇన్నింగ్స్లు ఆడాడు. అయినా సెలెక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్తో పాటు రిజర్వ్గా శుభ్మన్ గిల్ ఉండటంతోనే పృథ్వీని ఎంపిక చేయనట్లు కనిపిస్తున్నది. ఇంగ్లండ్తో సిరీస్లో అరంగేట్రంలోనే ఆకట్టుకున్న అక్షర్ పటేల్ మూడో స్పిన్నర్ కోటాలో చోటు దక్కించుకున్నాడు.
భారత జట్టు: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, గిల్, మయాంక్, పుజారా, రహానే (వైస్ కెప్టెన్), విహారి, పంత్, అశ్విన్, జడేజా, అక్షర్, సుందర్, బుమ్రా, ఇషాంత్, షమీ, సిరాజ్, శార్దూల్, ఉమేశ్, కేఎల్ రాహుల్, సాహా.
స్టాండ్బై ఆటగాళ్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, అర్జాన్ నాగ్వస్వల్లా.