న్యూఢిల్లీ: కరోనా లక్షణాలున్న రిటైర్డ్ బ్రిగేడియర్కు ఆర్మీ ఆసుపత్రులలో బెడ్ లభించలేదు. ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు తీసుకెళ్లినా బెడ్లు లేక ఎవరూ అడ్మిట్ చేసుకోలేదు. దీంతో ఆక్సిజన్ అంబులెన్స్లో చండీగఢ్లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. రిటైర్డ్ బ్రిగేడియర్ రాష్పాల్ సింగ్ పర్మార్ కరోనా సంబంధ సమస్యలతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన కుమారుడు తొలుత ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బెడ్స్ ఖాళీగా లేకపోవడంతో ఆర్మీ బేస్ ఆసుపత్రి, డీఆర్డీవో ఆసుప్రతికి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. పడకలన్నీ కరోనా రోగులతో నిండిపోవడంతో పర్మర్ను అడ్మిట్ చేసుకోలేదు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లినా చేర్చుకునేందుకు నిరాకరించారు.
దీంతో ఆయన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి ఆక్సిజన్ ఉన్న అంబులెన్స్లో ఢిల్లీ నుంచి చండీగఢ్లోని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో పర్మార్ మరణించారు. కాగా, ఈ ఘటనపై మాజీ సైనికుల గ్రీవెన్స్ సెల్ విచారం వ్యక్తం చేసింది. రిటైర్డ్ బ్రిగేడియర్ను ఆర్మీ ఆసుపత్రుల్లో చేర్చుకోకపోవడాన్ని తప్పుపట్టింది. 1971 మార్చి 14న పర్మార్ ఆర్మీలో చేరారు. కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ (ఈఎంఈ) లో నియమితులయ్యారు. పర్మర్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.