బెంగళూరు: కరోనా నేపథ్యంలో శ్రీరామ నవమిని పందిళ్లలో భక్తులు జరుపుకోలేకపోయారు. సీతారాముల కళ్యాణాన్ని మండపాల్లో నిర్వహించలేకపోయారు. ఈ నేపథ్యంలో దేశంలోని పలు చోట్ల రామ భక్తులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కర్ణాటకలో కరోనా మహమ్మారి మరోసారి తన ప్రతాపం చూసుతున్నది. దీంతో బహిరంగ, సామూహిక శ్రీరామ నవమి వేడులకు భక్తులు దూరంగా ఉన్నారు.
అయితే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని బెంగళూరులోని శ్రీరామ సేవా మండళ్లు, ఆలయ ట్రస్ట్లు నిర్ణయించాయి. ఇందులో భాగంగా బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా రామ భక్తులు కరోనాపై అవగాహన కల్పించారు. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి వేషధారణలో ఇంటింటికి వెళ్లి మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు. కొన్ని ప్రాంతాల్లో మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ విధంగా శ్రీరామ నవమినాడు తమ రామ భక్తిని చాటుకున్నారు.