లండన్: బ్రిటన్ రాజధాని లండన్ నగరంలోని ఎలిఫెంట్ అండ్ క్యాస్టిల్ ట్రైన్ స్టేషన్ సమీపాన సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. సోమవారం మధ్యాహ్నం 1.43 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. స్టేషన్ సమీపాన గల రిపేర్ షాప్లో నాలుగు కార్ల మధ్య మంటలు అంటుకున్నాయని సమాచారం. పూర్తి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.
ఈ అగ్ని ప్రమాదంతో సౌత్ లండన్ స్టేషన్ నుంచి సమీప రెసిడెన్షియల్ టవర్ బ్లాక్ల మీదుగా నగర వ్యాప్తంగా నల్లటి పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తం అయ్యాయి.
ముందు జాగ్రత్త చర్యగా స్థానికులను ఘటనా స్థలం నుంచి తరలించారు. రైల్వే స్టేషన్ కింద ఏర్పాటు చేసిన ఆర్చ్లు, ఆరు కార్లు, ఒక టెలిఫోన్ బాక్స్కు నిప్పంటుకున్నట్లు తెలుస్తున్నది. ఒకరికి అంబులెన్స్లో చికిత్స అందించినట్లు సమాచారం.
ఈ మంటలను ఆర్పివేసేందుకు 15 అగ్ని మాపక దళాలు, 100 మంది సిబ్బంది రంగంలోకి దిగారు. సాయంత్రం 4 గంటల్లోపు మంటలు ఆర్పివేశారు. ప్రజలను తమ ఇండ్ల తలుపులు, కిటికీలు మూసివేసుకోవాలని లండన్ పోలీసులు అభ్యర్థించారు.
అగ్ని ప్రమాదం నేపథ్యంలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. తర్వాత కొన్ని రైళ్లు రాత్రి 8 గంటలకు వస్తాయని అధికారులు ప్రకటించారు.