హైదరాబాద్ : రానున్న శతాబ్ద కాలానికి ఉపయోగపడేలా కొత్తగా నిర్మించే పరిపాలనా సంబంధిత భవనాలు ఉండాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలాష. సీఎం ఆకాంక్ష కనుగుణంగానే సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్, కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ భవనాలను పోలీస్ శాఖ నిర్మించింది. ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, ఐటీ ఆధారిత సేవలను ఉపయోగించడం ద్వారా నేర పరిశోధనతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ, మెరుగైన పోలీసింగ్ను చేపట్టే విధంగా నిర్మించిన ఈ పోలీస్ పాలనా భవనాలను సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. పూర్తిగా పర్యావరణహిత, హరిత ప్రమాణాలతో మొత్తం 58,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన సిద్ధిపేట పోలీసు కమీషనరేట్, 52 ,000 చ,అ విస్తీర్ణంలో నిర్మించిన కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ భవనాల్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి.
ఈ భవన నిర్మాణాలు డిజైన్తో పాటు దీనిలో ఉండాల్సిన సౌకర్యాలన్నింటినీ సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించి నిర్థారించారు. ఈ నూతన పోలీస్ కార్యాలయ భవనాల్లో పౌరులతో పీస్ కమిటీ, మైత్రి సంఘాలు, పోలీసు అధికారులతో సమావేశాల నిర్వహణకు విశాలమైన కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం, కమాండ్ కంట్రోల్ సెంటర్, ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్, సైబర్ సెల్, డిజిటల్ ట్రైనింగ్ సెంటర్, ఫంక్షనల్ వర్టికల్ మానిటరింగ్ కేంద్రం…ఇలా ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ప్రత్యేక విభాగాలున్నాయి. ఇదే విధమైన పోలీస్ కార్యాలయ భవనాలను రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లను జిల్లాలలో నిర్మించాలని సీఎం చేసిన ఆదేశాల మేరకు వీటి నిర్మాణం చేపట్టేందుకు పోలీస్ శాఖ ప్రణాళికలను రూపొందించింది. ఈ కొత్త పోలీస్ కార్యాలయాల్లో ఉన్న ప్రత్యేకతలు.
పోలీస్ కమీషనరేట్ లోకి ఫిర్యాదుదారుడు ప్రవేశించగానే రెసెప్షన్ కేంద్రంలో పిటీషన్ ను స్వీకరిస్తారు. పిటీషన్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ లో స్వీకరించిన ఈ పిటీషన్ కు సంబందించిన ప్రత్యేక నెంబర్ పిటీషన్ దారుడికి మెసేజ్ రూపంలో మొబైల్ ఫోన్ కు వస్తుంది. దీనితో తన ఫిర్యాదుకు సంబందించిన స్టేటస్ ను తెలుసుకునే వీలుంటుంది.
ముందు ముందు రానున్న ఆధునిక సాంకేతికను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటుచేసిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మొత్తం కమిషనరేట్ పరిధిలోని సీసీ టీవీ ల పర్యవేక్షణ, ముఖ చిత్ర గుర్తింపు (ఫిషియల్ రికగ్నేషన్ ) విధానం కూడా ఉంది. సిద్ధిపేట నగరంలో ఉన్న 450 సిసి టీవీ లు, గజవెల్ లోని 350 సీసీ టీవీలు, ప్రజ్ఞాపూర్ తోపాటు ప్రధాన రహదారిపై ఉన్న 130 సీసీ టీవీ లను ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా శాంతి, భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణను నిరంతరం పర్యవేక్షిస్తారు. ,
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకై అమలు చేస్తున్న అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఈ ట్రాఫిక్ కమాండ్ సెంట్రల్ రూమ్ లోనూ ఉపయోగిస్తున్నారు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ గుర్తింపు విధానం, సీసీ టీవీ ల ద్వారా ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ రెడ్ లైట్ అతిక్రమణ దారుల గుర్తింపు, కృత్రిమ మేధ (ఏ.ఐ) నుపయోగించి ఈ-చలాన్ విధింపు తదితర ప్రత్యేకతలున్నాయి.
జిల్లా, కమీషనరేట్ పరిధిలో శాంతి, భద్రతల పరిస్థితుల సమీక్ష, శాంతి, మైత్రీ సంఘాల సమావేశం, పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశాల నిర్వహణకై అన్ని హంగులతో ప్రత్యేక సమావేశపు హాల్ కూడా ఏర్పాటు చేశారు.
ఈ ఐటి, సైబర్ సెల్ లో ఆధునిక పరిజ్ఞానంతోకూడిన ఫోరెన్సిక్ పరికరాలున్నాయి. మొబైల్ ఫోన్, హార్డ్ డిస్క్ లనుండి ఏ సమాచారమైన స్వీకరించే పరిజ్ఞానం ఈ సైబర్ సెల్ లో ఉంది.
నేరపరిశోధనలో అత్యాధునిక టెక్నాలజీ ని ఉపయోగించడం ద్వారా కేసులను అతి తక్కువ సమయంలోనే ఛేదించే విధంగా ఈ ఎఫ్.పి.బి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భౌతిక సాక్ష్యాల సేకరణ, శరీర ద్రవాల సేకరణ కిట్, వేలిముద్రల సేకరణ కిట్ లు ఈ సెంటర్లో ఉన్నాయి.
కమిషనరేట్ పరిధిలోని అని పోలీస్ స్టేషన్లలో పోలీసు అధికారులకు నిర్దేశించిన వర్టికల్ విధులను అధికారులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనే విషయాలను ఈ ఫంక్షనల్ కాంపిటెన్సీ సెంటర్ లో విశ్లేషిస్తారు. పోలీస్ అధికారులకు నిర్దేశించిన 17 ఫంక్షనల్ వర్టికల్ అంశాలను చేసే ఈ విశ్లేషణ ద్వారా వచ్చే ఫలితాలను సంబంధిత పోలీసు అధికారులకు ఈ కేంద్రం తెలియ చేస్తుంది.
సాంకేతిక రంగం లో వచ్చే ఆధునిక విధానాలపై పోలీస్ అధికారులకు ఎప్పటికప్పుడు ప్రత్యేక శిక్షణను అందించేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేశారు.
పోలీస్ కమీషనర్ కు కళ్ళు, చెవులుగా స్పెషల్ బ్రాంచ్ విభాగం పనిచేస్తుంది. కమీషనరేట్ పరిధిలో జరిగే పలు సంఘటనలను ఈ విభాగం సేకరిస్తుంది. ఫెస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాలలో వచ్చే సమాచారాన్ని ఈ కంట్రోల్ రూమ్ లో విశ్లేషించి అందులో కనుకున్న విషయాలను కమీషనర్ కు ఎప్పటికప్పుడు తెలియ చేస్తారు.
మొత్తం నిర్మాణం….58 , 300 చదరపు అడుగులు.
గ్రౌండ్ ఫ్లోర్….19 ,785 చ.అ
ఫస్ట్ ఫ్లోర్ ……16 ,069 చ.అ
సెకండ్ ఫ్లోర్ …..19 ,493 చ.అ.
టెర్రేస్ ఏరియా … 3, 002 చ.అ
దీనితో పాటు ఈ కమిషనరేట్ కార్యాలయ భవనంలో 120 మంది పౌరులు కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అత్యంత ఆధునిక ప్రమాణాలు, గ్రీన్ బిల్డింగ్ గా నిర్మించిన సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవనం దేశంలో ఉన్న ఆధునిక భవనంలో ఒకటిగా చెప్పుకోవచ్చు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ భవనాన్ని 52 వేల చదరపు అడుగులలో నిర్మించారు. మొత్తం 31 .30 ఎకరాల్లో ఉన్న ఈ పోలీస్ కార్యాలయ అవరణలో పరేడ్ గ్రౌండ్, హెలిపాడ్ తదితర సౌకర్యాలను కల్పించారు.